ఫ్లెక్సీల‌పై చెయ్యేస్తే.. చెయ్యి న‌రుకుతా.. మాజీ మంత్రి అనిల్ వ‌ర్గానికి ఆనం హెచ్చ‌రిక‌

Update: 2022-04-19 17:01 GMT
తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ దూకుడుకు.. నెల్లూరులో వైసీపీ రాజ‌కీయాలు హీటెక్కాయి. నెల్లూరు న‌గ‌ర నియొజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రి ఫ్లెక్సీలు క‌ట్టేది లేద‌ని.. క‌ట్టించేది లేద‌ని.. అనిల్ చేసిన వ్యాఖ్య‌లు.. ఈ క్ర‌మంలో కొన్ని ఫ్లెక్సీల‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చించేసిన ఘ‌ట‌న‌లు పార్టీ నేత‌ల మ‌థ్య తీవ్ర వివాదానికి, హెచ్చ‌రిక‌లకు కూడా దారితీశాయి. ఈ క్ర‌మంలో స్పందించిన మాజీ మంత్రి, ప్ర‌స్తుత వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి త‌మ్ముడు.. ఆనం విజ‌య్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.. ఎక్క‌డా అనిల్ పేరును ఎత్త‌కుండానే ఆయ‌న గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు.

``మా పెద‌నాన్న ప్లెక్సీపై చేయి వ‌స్తే వాడెవ‌డైనా కానీ.. చేతిని న‌రుకుతా`` అని విజ‌య్‌కుమార్‌రెడ్డి సంచ‌ల‌న హెచ్చ‌రిక చేశారు. మంగ‌ళ‌వారం.. ఆనం కుటుంబ‌పెద్ద ఏసీ సుబ్బారెడ్డి జ‌యంతి. ఈ  సంద‌ర్భంగా నెల్లూరు న‌గ‌రంలోని ఏసీ సెంట‌ర్‌లో కుటుంబ స‌భ్యులు కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.ఈ క్ర‌మంలో ఏసీ సెంట‌ర్‌లో సుబ్బారెడ్డి నిలువెత్తు ప్లెక్సీల‌ను  ఏర్పాటు చేశారు. అయితే.. వీటిని కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రాత్రికి రాత్రి  ధ్వంసం చేశారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆనం విజ‌య్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తామంతా వైఎస్ కుటుంబ స‌భ్యుల‌మే అన్నారు. తన‌కు నెల్లూరు డీసీసీబీ చైర్మ‌న్‌గా ప‌ని చేసే అవ‌కాశాన్ని  వైఎస్ జ‌గ‌న్ క‌ల్పించార‌న్నారు. అలాగే త‌న భార్య ఆనం అరుణ‌మ్మ ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ అని తెలిపారు. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీని చించివేయ‌డం తీవ్ర ఆవేద‌న క‌లిగిస్తోంద‌న్నారు. వేమిరెడ్డి సంతోషంగా పుట్టిన రోజు జ‌రుపుకోకుండా, ఏమిటీ బాధ పెట్టే ప‌నుల‌ని ప్ర‌శ్నించారు. వేమిరెడ్డి ఎప్పుడూ తొడ‌లు చ‌ర‌చ‌లేద‌ని, మీసాలు తిప్ప‌లేద‌ని ప‌రోక్షంగా మాజీ మంత్రి అనిల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇక త‌మ పెద‌నాన్న ఏసీ సుబ్బారెడ్డి ప్లెక్సీని చించివేయ‌డాన్ని విజ‌య్‌కుమార్‌రెడ్డి నిల‌దీశారు. ``50 మంది కాదు, వంద మంది వ‌చ్చి ప్లెక్సీల‌ను చించ‌డానికి ప్ర‌య‌త్నించినా చూస్తూ ఊరుకోం. అడ్డం ప‌డ‌కుండా ఊరుకుంటామా?`` అని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌మ పెద‌నాన్న ప్లెక్సీని చించివేస్తుంటే, వంద మంది వ‌చ్చార‌ని, అశ‌క్తుల‌మ‌ని దండం పెట్టి ప‌క్క‌కు పోతామా? అని నిల‌దీశారు. ప్రాణ‌మైనా ఇస్తామ‌ని అన్నారు. చెయ్యి తాకినోడి చెయ్యి న‌రికేస్తామ‌ని ఘాటుగా హెచ్చ‌రించారు.  

ఇంత అనుభ‌వం వ‌చ్చింది, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ప‌ని చేస్తున్నార‌ని ప్ర‌స్తావించారు. మ‌నం ఇంకా మాన‌సికంగా పెర‌గ‌క పోతే ఎలా అంటూ.. అనిల్‌పై కారాలు మిరియాలు నూరారు.  జిల్లాలో పార్టీకి సంబంధించి ప‌ది మంది ఎమ్మెల్యేలున్నార‌ని, వారంతా క‌లిసి ప‌నిచేస్తే సంతోష‌మ‌న్నారు. ఒక‌వేళ బేధాభిప్రాయాలు ఉంటే స‌రి చేసుకోవాలే త‌ప్ప‌, వాళ్ల అభిమాన నాయ‌కుల వ‌ద్ద‌కు వెళుతుంటే ఇబ్బంది పెట్ట‌డం త‌ప్ప‌న్నారు. ద‌య‌చేసి ఏ ఎమ్మెల్యే అయినా స‌రే ఇలాంటి ప‌ద్ధ‌తులు మానుకోవాల‌ని ఆయ‌న హిత‌వు చెప్పారు. 
Tags:    

Similar News