ప్రాథమికహక్కుల కూడా పట్టవా.. హథ్రాస్​ ఘటనపై హైకోర్టు సీరియస్​

Update: 2020-10-02 08:50 GMT
కుటుంబసభ్యులకు కూడా చెప్పకుండా హత్రాస్​ గ్యాంగ్​రేప్​ బాధితురాలికి పోలీసులు అర్ధరాత్రి అంత్యక్రియలు చేయడం పట్ల అలహాబాద్​ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కోర్టు.. అంత్యక్రియల ఘటనపై అక్టోబర్​ 12 లోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని హోంశాఖ  అడిషనల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, జిల్లా మెజిస్ట్రేట్‌కు సమన్లు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ రంజన్ రాయ్, జస్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

‘అంత్యక్రియలు జరుపుకొనే విషయంలో బాధితురాలి తల్లిదండ్రులకు కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. పోలీసులు వాటిని ఉల్లంఘించారా? లేదా అనే విషయంపై మేము దర్యాప్తు జరుపుతాం. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా పోలీసులు వ్యవహరించి ఉంటే మాత్రం కఠినచర్యలు తప్పవు’ అంటూ న్యాయమూర్తులు పేర్కొన్నారు.

‘ఆర్టికల్​21, 25 లను పోలీసులు ఉల్లంఘించి ఉంటే అది తీవ్రస్థాయి నేరంగా పరిగణిస్తాం. బాధితురాలి కుటుంబం బలహీనమైనది కాబట్టి ఈ రకమైన చర్యలకు దిగిఉంటే మాత్రం అది చాలా తప్పు. మృతులకు గౌరవప్రదమైన అంతిమసంస్కారం వారి హక్కు. ఈ కేసును నీరుగార్చేందుకు నిందితులు యత్నించవచ్చు. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అలాకాకుండా నిందితులకు సహకరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు’అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

హాత్రాస్​లో గ్యాంగ్​రేప్​కు గురైన బాధితురాలికి కుటుంబ సభ్యులను ఇళ్లలో నిర్బంధించి పోలీసులే అర్ధరాత్రి 2.30గం. సమయంలో మృతదేహాన్ని ఖననం చేసిన విషయం తెలిసిందే. తమందరినీ ఇంట్లో పెట్టి.. తాళం వేసి మృతదేహాన్ని తరలించారని మృతురాలి సోదరుడు, సోదరి తెలిపారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News