కరోనా : ప్రపంచవ్యాప్తంగా 69 లక్షల మరణాలు .. ఆ సంస్థ సంచలన రిపోర్ట్!

Update: 2021-05-07 12:30 GMT
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఏడాదిన్నర సమయం అవుతోంది. ఈ మహమ్మారి పీడ మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఇప్పట్లో తొలగిపోయేలా కూడా లేదు. ప్రస్తుతం సెకండ్ వేవ్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇదిలా ఉంటే ..ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలను తక్కువ చేసి చూపుతున్నట్లు వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం వేదికగా పనిచేస్తున్న స్వతంత్ర ప్రపంచ ఆరోగ్య పరిశోధన సంస్థ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యూయేషన్‌ (ఐహెచ్‌ ఎంఈ) ఓ సంచలన రిపోర్ట్ ను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కారణంగా 69 లక్షల మంది చనిపోయి ఉంటారని ఈ సంస్థ అంచనా వేసింది.

అయితే , గురువారం నాటికి దాదాపు 32.64 లక్షల మంది కరోనా మహమ్మారితో చనిపోయినట్లు వివిధ దేశాలు వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. భారత్‌ లో కొవిడ్‌ మరణాల సంఖ్య 6.54 లక్షలుగా పైగా ఉండొచ్చని పేర్కొంది. ఈ మేరకు అధ్యయన నివేదికను గురువారం విడుదల చేసింది. ఇప్పటి నుంచి సెప్టెంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని, అందులో సగం వరకు భారత్‌లో ఉండే ప్రమాదం ఉందని సంస్థ ప్రొఫెసర్‌ క్రిస్టోఫర్‌ జేఎల్‌ ముర్రే తెలిపారు. ప్రధానంగా తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో మరణాలను తక్కువగా చూపుతున్నట్లు పేర్కొన్నారు. ఈజిప్ట్‌ లో ప్రభుత్వం చెప్పిన లెక్కల కంటే 10 రెట్లు ఎక్కువ మరణాలున్నట్లు అధ్యయనంలో తేలిందన్నారు. పరీక్షలు ఎక్కువ చేయకపోతే లెక్కలోకి రాని కొవిడ్‌ మరణాలు అధికంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

ఈ సంస్థ 59 దేశాల్లోని 198 రాష్ట్రాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసింది.  అన్ని రకాల సమాచారాన్నివిశ్లేషిస్తే.. ప్రస్తుతం లెక్కల్లో చెప్పినదాని కన్నా ఎక్కువగానే మరణాలున్నట్లు నిర్ధారించుకొని వాస్తవానికి దగ్గరగా రావడానికి ప్రయత్నించామని, మరణాలు అధికంగా సంభవించడానికి రకరకాల కారణాలున్నాయని , చాలామంది ప్రజలు ఆసుపత్రులకు దూరంగా ఉన్నారని , కొన్ని దేశాల్లో ఆందోళన  తోపాటు, మందుల వినియోగం పెరిగిపోయిందని , ఇలాంటి కారణాల వల్ల కొన్ని మరణాలు పెరిగి ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న సమయంలో హృద్రోగం, దీర్ఘకాల ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు కూడా మరణిస్తున్నారు. ఇలాంటి లెక్కలన్నింటినీ కలిపి చూసినప్పుడు మరణాలు అధికారిక లెక్కల కంటే ఎక్కువే ఉన్నాయని చెప్తుంది.
Tags:    

Similar News