ఆ జీన్స్... ఈ జీన్స్... ఆధ్యాత్మిక గురువు ఆసక్తికర వ్యాఖ్యలు!
అవును... తాజాగా ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చిదానంద సరస్వతి ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు.;
ఎవరైనా వ్యక్తి ఆధ్యాత్మికత వైపు దృష్టిసారించాలంటే.. అందుకోసం ధరించే దుస్తుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. జీన్స్ లాంటి దుస్తులు ధరించవచ్చా.. లేక, సంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకోవాలా? అనే విషయాలపై తాజాగా పరమార్థ నికేతన్ ఆశ్రమ గురువు, ఆధ్యాత్మికవేత్త అయిన చిదానంద సరస్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... తాజాగా ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చిదానంద సరస్వతి ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఇందులో భాగంగా... ఇటీవల కుంభమేళా సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన ఓ యువకుడి సందేహం, అందుకు తానిచ్చిన సమాధానాన్ని వెల్లడించారు.
ఇందులో భాగంగా... తన వద్దకు వచ్చిన ఓ యువకుడు.. తాను ఆధ్యాత్మికత వైపు దృష్టిసారించాలంటే ప్రస్తుతం తాను వేసుకుంటున్న జీన్స్ ను వదిలేసి, సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాల్సి ఉంటుందా? అని ప్రశ్నించాడని తెలిపారు. అయితే... ఏ దుస్తులు ధరిస్తున్నారని కాదు.. ఎలాంటి విలువలు పాటిస్తున్నారనేది ముఖ్యమనేది అన్నారు.
ఇదే సమయంలో... కుంభమేళాకు చాలా మంది జీన్స్ ధరించి వచ్చారని.. అయితే, దాంతో ఎలాంటి ఇబ్బంది లేదని వివరించిన చిదానంద సరస్వతి.. వచ్చినవారు వారి జీన్స్ (మూలాలను), సంస్కృతీ సంప్రదాయాలను మరిచిపోతేనే ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిరంజని అఖాడా అధిపతి స్వామి కైలాసానంద గిరి మాట్లాడుతూ... కుంభమేళాకు రావాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా అనుకున్నారని తెలిపారు. కుంభమేళాలో ఏర్పాటుచేసిన తమ శిబిరంలో బస చేయడానికి ఎలాన్ మస్క్ ఆసక్తి చూపించారని పేర్కొన్నారు!
అదేవిధంగా... ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని స్వామి కైలాసానంద గిరి ప్రశంసించారు. అది సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఉండటం వల్లే సాధ్యమైందని అన్నారు.