సెకండ్ సమ్మర్ తో సరికొత్త సమస్య

Update: 2015-08-11 06:02 GMT
ఏడాదికి ఒకసారి వేసవి వస్తేనే వణికిపోయే జనాలకు.. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో రెండు సమ్మర్లన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. మార్చితో మొదలయ్యే వేడి.. జూన్ మొదటివారంతో తగ్గుముఖం పడతాయి. కానీ.. ఈసారి పరిస్థితి అందుకు భిన్నం. జూన్.. జూలై పూర్తయి ఆగస్టు వచ్చేసినా వర్షాల జాడే కనిపించటం లేదు.

ఈ వేడి తీవ్రత కారణంగా ఒక విచిత్రమైన సమస్యను రెండు రాష్ట్రాల్లోని తెలుగువారు ఎదుర్కొంటున్నారు. శరీరం పొడిబారటం.. శరీరం మీద పగుళ్లు (కాళ్ల భాగంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి).. జిల.. దురద లాంటివి ఎక్కువ అవుతున్నాయి. ఈ కారణంగా శరీరం మీద దద్దుర్లు వస్తున్న పరిస్థితి. ఇలాంటి కేసులు గడిచిన రెండు నెలల్లో తమ దృష్టికి ఎక్కువగా వస్తున్నట్లు డెర్మిటాలజిస్ట్ లు చెబుతున్నారు.

దీనికి ప్రత్యేక కారణం ఏమీ లేదని.. మారిన వాతావరణ పరిస్థితుల వల్లనేనని చెబుతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని.. ఎండలు ఎక్కువగా ఉండి.. వాతావరణం పొడిగా ఉండటం వల్ల.. మంచినీటిని వీలైనంత ఎక్కువగా తాగటం వల్ల ఈ సమస్యను అధిగమించొచ్చని చెబుతున్నారు.

ఎండాకాలంలో మాదిరి మంట పుట్టనప్పటికీ.. ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. ఈ కారణంగా.. శరీరం చాలా త్వరగా పొడిబారుతోందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎక్కువగా నీళ్లు తాగటం (ఒకేసారి కాకుండా.. తరచూ నీటిని తాగటం చాలా అవసరం) ద్వారా శరీరం పొడిబారటం.. చర్మం పగలటం.. దురద లాంటి సమస్యలు అధిగమించొచ్చని చెబుతున్నారు.
Tags:    

Similar News