నేతల ఫ్రెస్ట్రేషన్: వైసీపీలో ఉంటే తప్పదా...?
వైసీపీ నేతల ఫ్రెస్ట్రేషన్ మామూలుగా లేదు. పార్టీ అధినేత జగన్ వైఖరితో వారు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఇది వారి మాటల్లోనే వినిపిస్తోంది.
వైసీపీ నేతల ఫ్రెస్ట్రేషన్ మామూలుగా లేదు. పార్టీ అధినేత జగన్ వైఖరితో వారు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఇది వారి మాటల్లోనే వినిపిస్తోంది. పైకి ఎవరూ బహిరంగ విమర్శలు చేయకపోయినా.. అంతర్గతంగా ఫోన్లలో మాత్రం తమ బాధలు చెప్పుకొంటున్నారు. ``ఇప్పుడు స్థానిక ఎన్నికలు అంటున్నారు. ఏకగ్రీవాలు కారాదని షరతు విధించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదంటున్నారు. సరే.. ఇప్పుడు కష్టపడతాం. కానీ, వచ్చే ఏడు పాదయాత్ర ఉంది. దానిపై ఎన్నిషరతులు విధిస్తారో.. మాకే అర్థం కావట్లేదు.`` అని సీనియర్ నేత ఒకరు తలపట్టుకున్నారు.
``ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకునే సత్తా మాకు ఉందని అనుకోవడం లేదు. ఉన్నా.. కూటమి కొన్ని ప్రాంతాల్లో బలం గానే ఉంది. వారిలో ఉన్న కట్టుబాటు కసి.. మాకు తక్కువగా ఉంది.`` అని మాజీ మంత్రి ఒకరు కుండబద్దలు కొట్టారు. ఇవన్నీ.. మీడియా మిత్రులతో పంచుకున్నవే కావడం గమనార్హం. మరి ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? ముఖ్యంగా ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు.. పోరాడితే ఉన్న ఓటు బ్యాంకు కూడా పోతే పరిస్థితి ఏంటనేది కొందరు నాయకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో నేతల మధ్య సఖ్యత పెంచేదిశగా పార్టీ అధినేత చర్యలు ఉండాలని సూచిస్తున్నవారు కొంద రు ఉన్నారు. ``ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. లోకల్గా ఏం జరుగుతోందో మాకు తెలుసు. ఈ విషయా లు చెబితే పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలో అర్ధం కావడం లేదు.`` గతం లో ప్రభుత్వ విప్గా పనిచేసిన సీనియర్ నేత వాపోతున్నారు. ఇవన్నీ.. సీనియర్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో జూనియర్ల సంగతేంటి? అనేది ప్రశ్న.
ఇది ఒక్క నియోజకవర్గానికి, ఒక జిల్లాకు పరిమితమైంది కాదు. దాదాపు సగానికిపైగా జిల్లాల్లో వినిపిస్తున్న మాట. పార్టీ పరంగా దూకుడుగా ఉన్నా.. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. కూటమి వ్యూహాలు అంతుచిక్కడం లేదని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కేసులు పెట్టించుకునేందుకు మేం సిద్ధంగా లేమని నెల్లూరుకు చెందిన కార్యకర్తలు చెప్పేస్తున్నారని.. మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక్కడి రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి. దీంతో జగన్పై అసహనం.. కోపం.. అన్నీ పెరుగుతున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.