జగన్ 2.0 : పులివెందులలో మారిన సీన్

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఆయన మూడు రోజుల పర్యటన కోసం పులివెందులలో ప్రస్తుతం మకాం చేస్తున్నారు.;

Update: 2026-02-26 03:35 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఆయన మూడు రోజుల పర్యటన కోసం పులివెందులలో ప్రస్తుతం మకాం చేస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ టూర్ ఆసక్తికరంగా మారింది. గతానికి భిన్నంగా కూడా సాగుతోంది. పులివెందులలో ప్రజా దర్బార్ లను నిర్వహించడమే కాదు, పార్టీ నేతలతో క్యాడర్ తో జగన్ మమేకం అవుతున్నారు. అదే విధంగా ఆయన స్థానికంగా ఒక ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న బంధువులు, పార్టీ నేతల ఇళ్లకు వెళ్ళి మరీ పరామర్శలు చేశారు.

జగన్ మారారు :

ఈ మాట క్యాడర్ అంతా అనుకుంటున్నారు. గతంలో జగన్ పెద్దగా పులివెందుల వచ్చినది లేదు వచ్చినా క్యాడర్ తో అంతగా కలిసింది లేదు అని చర్చించుకునే వారు. కానీ ఇపుడు జగన్ తన పర్యటనల ద్వారా మారారు అన్నది అయితే క్యాడర్ స్పష్టంగా చెబుతోంది. జగన్ తాజా పర్యటనలో అది ప్రస్ఫుటంగా కనిపించింది అని అంటున్నారు. ఆయన గతానికి భిన్నంగా వ్యవహరించడమే దీనికి కారణం అని అంటున్నారు.

రాజారెడ్డి సోదరి వద్దకు :

జగన్ తాత అయిన వైఎస్ రాజారెడ్డి మరణించి మూడు దశాబ్దాలు కావస్తోంది. ఆయనకు ఒక సోదరి ఉన్నారు. ఆవిడ పేరు కమలమ్మ. ఆవిడ వయో వృద్ధురాలి గా ఉంటూ అనారోగ్యంతో అవస్థ పడుతున్నారు. జగన్ తాజా టూర్ లో కమలమ్మ ఇంటికి స్వయంగా వెళ్ళి పరామర్శించడం కీలక పరిణామం గా చెబుతున్నారు. ఆమె యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే వైసీపీ నేత ఈశ్వరయ్య ఇంటికి వెళ్ళి ఆయన ఆరోగ్యం గురించి కూడా జగన్ అడిగి తెలుసుకున్నారు. దాంతో బంధువులు క్యాడర్ లో జగన్ అయితే ఒక భరోసా కల్పించారు. అలాగే వేంపల్లె మండలంలో ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో జగన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా తనపైన ప్రత్యర్ధులు వేస్తున్న హిందూ వ్యతిరేక ముద్రను చేతల ద్వారానే తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు అని అంటున్నారు.

గ్యాప్ ఎందుకు అంటే :

నిజానికి చూస్తే జగన్ కి పులివెందుల నియోజకవర్గం అంతా బాగా తెలుసు. వైఎస్సార్ ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచినపుడు ఆ నియోజకవర్గంలో ఉంటూ జనంతో మమేకం అయినది జగన్ అన్నది చాలా మందికి తెలియదు. కాంగ్రెస్ లో తన తండ్రి గెలుపు బాధ్యతలను జగన్ భుజాల మీద వేసుకుని పనిచేసేవారు. ఇక వైసీపీ స్థాపించిన తరువాత అయితే ఆయన అదే బంధాలను కొనసాగిస్తూ తాను తన తల్లి కాంగ్రెస్ కి రాజీనామా చేసి మరీ బ్రహ్మాండమైన మెజారిటీతో ఉప ఎన్నికల్లో గెలిచారు. ఇక 2014లో విపక్ష నేతగా జగన్ మీద బాధ్యతలు పెరిగాయి

పులివెందుల బాధ్యతలను :

దాంతో అప్పటి నుంచి ఆయన పులివెందులకి కొంత దూరం అయ్యారు 2017లో మొదలెట్టిన పాదయాత్ర పులివెందుల నుంచి అయినా జగన్ ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో సీఎం కావడంతో ఏకంగా పులివెందులలో దూరం పెరిగిపోయింది. పులివెందుల బాధ్యతలను ఆయన పార్టీ వారికి ఎంపీ అవినాష్ రెడ్డికి అప్పగించినా జగన్ తమ వద్దకు నేరుగా రాలేదన్న అసంతృప్తి అయితే వారిలో ఉంది. 2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయానికి కూడా అది ఒక కారణం అయింది. ఇక చూస్తే జగన్ ఇపుడు ఓటమికి గల కారణాలు తెలుసుకున్నారని అంటున్నారు. దాంతో పులివెందుల నుంచే తన యాక్షన్ ప్లాన్ ని స్టార్ట్ చేశారు అని అంటున్నారు. బంధాలను పెంచుకుంటూ జగన్ 2.0 ని చూపిస్తున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News