యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ ఫిర్యాదుల ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రముఖ యూట్యూబర్ నందనను శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.. ఆమెపై ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ కావడంతో విమానాశ్రయంలో పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా పోలీసులు స్పందించాల్సి ఉంది. ఈ పరిణామం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
విమానాశ్రయంలో నందనను గుర్తించిన పోలీసులు, ఆమెపై ఉన్న కేసులు, లుక్అవుట్ నోటీసులకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.. అనంతరం ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారని తెలిసింది. నందనను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
లండన్ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు
నందన, ఆమె భర్తపై గతంలో పలు ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లండన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగాల కోసం ఆశపడ్డ పలువురు బాధితులు ఈ వ్యవహారంపై పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.
ఈ ఫిర్యాదుల ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో భాగంగా నందన దంపతుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వారు విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
లుక్అవుట్ నోటీసులతో పట్టుబడిన నందన
ఈ నేపథ్యంలో నందన శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సమయంలో ఆమె వివరాలను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. లుక్అవుట్ నోటీసులు అమల్లో ఉండటంతో ఎయిర్ పోర్టు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదైన ప్రాంతానికి సంబంధించిన పోలీసులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం నందనను ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. . ఆమెపై నమోదైన కేసులు, డబ్బుల వసూళ్లకు సంబంధించిన ఆరోపణలు, బాధితుల ఫిర్యాదులు తదితర అంశాలపై నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది..
నందనపై వచ్చిన ఆరోపణలు దర్యాప్తులో ఉన్న అంశాలేనని, వాటిపై పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ కేసులో మరెవరైనా ప్రమేయం ఉందా? ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎలాంటి హామీలు ఇచ్చారు? అనే అంశాలపై కూడా పోలీసులు దృష్టి సారించే అవకాశం ఉంది.
నందనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకోవడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. ఇబ్రహీంపట్నం పోలీసుల తదుపరి విచారణతో ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.