పచ్చని పెళ్లి ఇంటిని శ్మశానంలా మార్చిన అమెరికా
అమెరికా-ఇరాన్ మధ్య ఇప్పటికే తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరో ఘోర విషాదానికి దారితీశాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఇప్పటికే తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరో ఘోర విషాదానికి దారితీశాయి. దక్షిణ ఇరాన్లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్ సిరిక్ కౌంటీ పరిధిలోని కుహెస్తక్ ప్రాంతంలో ఒక నివాస భవనంపై అమెరికా దళాలు జరిపిన దాడి సంచలనం సృష్టించింది. అత్యంత ఆనందోత్సాహాల మధ్య వివాహ వేడుక జరుగుతున్న సమయంలో ఈ దాడి జరగడంతో ఆ ఇల్లు కాస్తా రణరంగంగా మారింది. ఈ ప్రమాదంలో ఒక పసికందుతో సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించగా 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఇరాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
సంతోష సమయం.. అంతట్లోనే విషాదం
స్థానిక వర్గాల సమాచారం ప్రకారం.. దాడి జరిగిన సమయంలో ఆ భవనంలో వివాహ వేడుకకు సంబంధించిన కీలక కార్యక్రమం జరుగుతోంది. వధువు, వరుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేడుక ఘనంగా జరుగుతుండగా ఒక్కసారిగా బాంబు దాడి జరగడంతో భవనం తీవ్రంగా దెబ్బతిని శిథిలమైంది.
ఇరాన్ రెడ్ క్రెసెంట్ సంస్థ ప్రారంభంలో నలుగురు చనిపోయారని ప్రకటించినప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే కొద్దీ మృతుల సంఖ్య ఐదుకు పెరిగినట్లు సమాచారం అందింది. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రక్షణ శాఖ సమర్థన.. అంతర్జాతీయ ఆందోళన
అమెరికా సైన్యం మాత్రం తమ దాడులు కేవలం ఇరాన్కు చెందిన సైనిక స్థావరాలు, వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, సముద్ర ఆధారిత సైనిక మౌలిక వసతులపైనే జరుగుతున్నాయని పేర్కొంది. అయితే ప్రజా నివాసాల మధ్య ఉన్న ఈ నిర్దిష్ట భవనాన్ని అమెరికా దళాలు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
సామాన్యులు, ముఖ్యంగా చిన్న పిల్లలు బలైపోతుండటంతో అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సైనిక చర్యల్లో పౌర నివాస ప్రాంతాలు దెబ్బతినడం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతీకారానికి ఇరాన్ హెచ్చరిక
నిరపరాధులైన పౌరులు, చిన్నారి బలికావడంపై ఇరాన్ ప్రభుత్వం ఆగ్రహంతో ఊగిపోతోంది. అమెరికా చేసిన ఈ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండించిన ఇరాన్ నాయకత్వం, ఈ రక్తపాతానికి తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో రెండు దేశాల మధ్య దాడులు-ప్రతిదాడులతో యుద్ధ మేఘాలు కమ్ముకోగా ఈ తాజా ఘటన ఇరు దేశాల మధ్య వివాదాన్ని మరింత రాజేసేలా కనిపిస్తోంది.