హారన్ కొట్టాడని ప్రాణం తీశారు.. నిందితులకు పోలీసుల ట్రీట్‌మెంట్.. వైరల్ వీడియో

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ చిన్నపాటి హారన్ వివాదం దారుణ హత్యకు దారితీసింది.

Update: 2026-08-30 08:09 GMT

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ చిన్నపాటి హారన్ వివాదం దారుణ హత్యకు దారితీసింది. ట్రాక్టర్ ఏజెన్సీ యజమాని యశ్ మిట్టల్‌ (27)ను కత్తులతో దాడి చేసి హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఘటనాస్థలానికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులు కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మాధవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్దమా ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ట్రాక్టర్ షోరూమ్ నిర్వహిస్తున్న యశ్ మిట్టల్ తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా.. రోడ్డుపై కొందరు యువకులు అడ్డుగా ఉన్నారు. దారి ఇవ్వాలని యశ్ హారన్ కొట్టడంతో వివాదం మొదలైనట్లు పోలీసులు తెలిపారు.

రెండోసారి హారన్ కొట్టడంతో గొడవ

రహదారిపై నుంచి పక్కకు వెళ్లాలని యశ్ మరోసారి హారన్ కొట్టడంతో అక్కడున్న యువకులు ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. మాటామాటా పెరగడంతో వారు యశ్ ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం యశ్, అతడి స్నేహితులపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో యశ్ తీవ్రంగా గాయపడి అక్కడి నుంచి కొంతదూరం వెళ్లి కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యశ్‌తో ఉన్న మరో ఇద్దరు స్నేహితులు కూడా గాయపడ్డారు.

ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా పోలీసులు గుర్తించగా.. నలుగురిని అరెస్ట్ చేశారు. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. అరెస్టయిన వారిలో విశాల్ ఠాకూర్, విజయ్ ఠాకూర్, కరణ్, సాగర్ ఉన్నట్లు సమాచారం.

నిందితులకు పోలీసుల ‘ట్రీట్‌మెంట్’.. వీడియో వైరల్

నలుగురు నిందితులను పోలీసులు ఘటనాస్థలానికి తీసుకెళ్లి సీన్ రీక్రియేట్ చేయించారు. ఈ సందర్భంగా వారిని సంకెళ్లు వేసి రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కొందరు పోలీసులు నిందితులపై ప్లాస్టిక్ పైపులతో కొడుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని వీడియోల్లో నిందితులు దెబ్బలకు అరుస్తూ ముందుకు నడుస్తున్న దృశ్యాలు ఉన్నాయి.

ఈ ఘటనపై స్థానికంగా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. యశ్ మిట్టల్ హత్యతో ఆగ్రహానికి గురైన కొందరు ప్రజలు పోలీసుల చర్యను సమర్థిస్తున్నప్పటికీ నిందితులను విచారణకు తీసుకెళ్లే సమయంలో ఇలా కొట్టడం చట్టపరంగా సమర్థనీయమా? అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

చిన్నపాటి రోడ్డుపై వివాదం ఒక యువ వ్యాపారి ప్రాణాలను బలిగొనడం ఉజ్జయినిలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ప్రస్తుతం ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తుండగా అరెస్టయిన నలుగురిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం పోలీస్ రిమాండ్‌కు పంపినట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి




Tags:    

Similar News