చైనాను కొడితే 'క్రిప్టో'కు దెబ్బ పడింది

గత మూడు సంవత్సరాలుగా క్రిప్టో మార్కెట్‌ బుల్‌ రన్‌లో ఉంది. కానీ ప్రస్తుత పతనం ఆ ర్యాలీకి ముగింపు కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.;

Update: 2025-10-12 10:22 GMT

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ ఆర్థిక విధానాలు ప్రపంచ మార్కెట్లలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ మార్కెట్‌.. ఇప్పటివరకు వేగంగా ఎదుగుతూ ఉన్న ఈ రంగం అకస్మాత్తుగా కుదేలైంది. చైనా ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించనున్నట్టు ట్రంప్‌ ప్రకటించడంతో, ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీల విలువలు ఒక్కసారిగా కుప్పకూలాయి.

* ట్రంప్‌ నిర్ణయమే కారణం!

ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పటికే చైనా దిగుమతులపై 30% సుంకం అమలు చేస్తోంది. కానీ అక్టోబర్‌ 10న ఆయన మరో కీలక ప్రకటన చేశారు. నవంబర్‌ 1 నుంచి చైనా ఉత్పత్తులపై అదనంగా 100% సుంకం విధించనున్నట్టు తెలిపారు. ఈ ప్రకటన అనంతరం అంతర్జాతీయ మార్కెట్లలో కలవరం నెలకొంది. పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున విక్రయాలకు దిగడంతో బిట్‌కాయిన్‌, ఎథేరియమ్‌, సొలానా, బినాన్స్‌ వంటి ప్రధాన క్రిప్టోలు తీవ్రంగా పతనమయ్యాయి.

*ఒక్కరోజులో 19 బిలియన్‌ డాలర్ల నష్టం

ట్రంప్‌ ప్రకటనకు గంటల్లోనే క్రిప్టో మార్కెట్‌ దాదాపు 19 బిలియన్‌ డాలర్లు (రూ. 1.70 లక్షల కోట్లు) నష్టపోయింది. బిట్‌కాయిన్‌ ధర 1.25 లక్షల డాలర్ల (రూ. 1.10 కోట్లు) గరిష్ఠ స్థాయి నుంచి 1.12 లక్షల డాలర్లకు పడిపోయింది. మార్కెట్‌ విలువ 4.30 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 3.74 ట్రిలియన్‌ డాలర్లకు తగ్గిపోయింది. నిపుణులు మరింత పతనం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

* చైనాతో సంబంధం ఏంటి?

క్రిప్టో ట్రేడింగ్‌లో చైనా పెట్టుబడులు భారీ స్థాయిలో ఉన్నాయి. క్రిప్టో మైనింగ్‌, ఎక్స్చేంజ్‌, ట్రేడింగ్‌ కార్యకలాపాలలో చైనా వ్యాపారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ట్రంప్‌ సుంకాల కారణంగా చైనా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుండటంతో, చైనా ట్రేడర్లు తమ క్రిప్టో ఆస్తులను విక్రయించడం మొదలుపెట్టారు. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ధరలు కుప్పకూలాయి.

* ముగుస్తుందా బుల్‌ మార్కెట్‌?

గత మూడు సంవత్సరాలుగా క్రిప్టో మార్కెట్‌ బుల్‌ రన్‌లో ఉంది. కానీ ప్రస్తుత పతనం ఆ ర్యాలీకి ముగింపు కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు. బిట్‌కాయిన్‌ ధర 1 లక్ష డాలర్ల స్థాయికి దిగితే, బుల్‌మార్కెట్‌ ఫేజ్‌ ముగిసినట్లే. ప్రస్తుతం బిట్‌కాయిన్‌ ఆధిపత్యం మొత్తం మార్కెట్‌ విలువలో 59%కి తగ్గింది.

* అరుదైన లోహాలపై చైనా ఆంక్షలు

ఈ ఆర్థిక యుద్ధానికి మరో కారణం చైనా తాజాగా తీసుకున్న నిర్ణయం. అరుదైన లోహాల తవ్వకం, ప్రాసెసింగ్‌, టెక్నాలజీ ఎగుమతులపై ఆ దేశం కొత్త ఆంక్షలు విధించింది. ముఖ్యంగా రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ ఎగుమతికి ప్రత్యేక అనుమతులు తప్పనిసరి చేసింది. దీంతో అమెరికాకు అవసరమైన ముడి పదార్థాల సరఫరా ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ చైనాపై 100% అదనపు టారిఫ్‌ ప్రకటించినట్లు వర్గాలు చెబుతున్నాయి.

* గ్లోబల్‌ ఎకానమీపై ప్రభావం

చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ ముదురుతుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. అరుదైన లోహాల సరఫరా ఆగిపోతే, ఎలక్ట్రానిక్‌, ఆటోమొబైల్‌, గ్రీన్‌ ఎనర్జీ రంగాలు తీవ్ర ప్రభావానికి గురవుతాయి. క్రిప్టో మార్కెట్‌లో ఇది మొదటి ప్రతిచర్య మాత్రమేనని, రాబోయే వారాల్లో మరింత అస్థిరత కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ట్రంప్‌ కొత్త సుంకాల ప్రకటనతో చైనా, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీని ప్రభావం క్రిప్టో మార్కెట్‌పై వెంటనే పడింది. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరింత అనిశ్చితి నెలకొనే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News