ఎమ్మెల్సీ రేసులో కొత్త ముఖాలు.. బాబుకు మరో టెస్టే.. !
టీడీపీలో మరోసారి పదవుల వేట కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు రాజ్యసభ సీట్ల వ్యవహారం పార్టీని కుదిపేసింది.
టీడీపీలో మరోసారి పదవుల వేట కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు రాజ్యసభ సీట్ల వ్యవహారం పార్టీని కుదిపేసింది. ఈ రేసులో చాలా మంది నాయకులు పోటీ పడ్డారు. బాబు కరుణిస్తారని ఎదురు చూశారు. కానీ, అనూహ్యంగా అనుకున్న వారికి టికెట్ దక్కలేదు. ఇక, ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం.. మరింత మంది పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు.. రెండు స్థానాలకు ఆరుగురు పోటీ పడుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలోనూ ప్రధానంగా ఐదుగురు గట్టి పోటీ ఇస్తున్నారు.
వర్ల రామయ్య: పార్టీ సీనియర్ నాయకుడిగా.. సుదీర్ఘకాలం నుంచి ఉన్న వర్ల.. గతంలో వైసీపీ హయాంలో రాజ్యసభ కు పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఈయన ఇప్పుడు ఖచ్చితంగా తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
నీలాయపాలెం: ప్రముఖ ఆడిటర్ కమ్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న నీలాయపాలెం విజయ్కుమార్.. గత ఎన్నికలకు ముందు పార్టీకి కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం ఆర్థికపరమైన అంశాలు.. వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తీసుకువస్తూ... పార్టీకి మౌత్పీస్గా వ్యవహరిస్తున్నారు. ఈయన కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. తనకు ఇస్తారన్న ఆశాభావం ఉందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
మంతెన: ప్రముఖ ఆరోగ్య ప్రచారకుడు, ప్రకృతి వైద్యం డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. అయితే.. ఆయనను మండలికి పంపించాలని చంద్రబాబే నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన కూడా ఆశగానే ఎదురు చూస్తున్నారు.
శ్రీనివాసులు రెడ్డి: కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీ రెడ్డి భర్త, పార్టీ కీలక నాయకుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి కూడా మండలిలో ఈ దఫా కుర్చీ ఖాయమని అనుకుంటున్నారు. రాజ్యసభ టికెట్పై ఆశలు పెట్టుకున్న ఆయన ఇది దక్కక పోయే సరికి అలకపాన్పు ఎక్కారు. ఇప్పుడు మండలి అయినా ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు.
బుద్దా వెంకన్న: విజయవాడకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు బుద్దావెంకన్న కూడా మండలి రేసులో ఉన్నారని టాక్. ఆయనకు 2014కు ముందు మండలిలో సభ్యత్వం దక్కింది. ఆ తర్వాత.. కూటమి అధికారంలోకి వచ్చినా.. ఆయనకు గుర్తింపు లేకుండా పోయింది. దీంతో ఇప్పుడైనా తనకు అవకాశం ఇవ్వాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.
పనబాక లక్ష్మి: మాజీ కేంద్ర మంత్రి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పనబాక లక్ష్మి కూడా మండలి రేసులో ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. తనకు మండలి ఇస్తే.. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని ఆమె చెబుతున్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం టీటీడీ బోర్డు సబ్యురాలిగా పనబాక వ్యవహరిస్తున్నారు.