ఎమ్మెల్యేలు తప్పుకొంటున్నారా.. తప్పించుకుంటున్నారా.. ?
ఆమె ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కావడంతో అయితే.. నాకు మీరు సమస్యలు చెప్పకండి.. జరుగుతున్న ప్రయోజనం గురించి వివరించండి అని అన్నారు.;

రాష్ట్రంలో కొందరు ఎమ్మెల్యేల తీరు చిత్రంగా ఉంది. ఇటీవల కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తన నియోజకవర్గంలో ప్రజలు సమస్యలు చెప్పేందుకు వస్తే.. ఇప్పుడు టైం లేదు .. తర్వాత రమ్మనండి! అని పంపేశారు. మరోవైపు.. ఇదే జిల్లాలో ఓ నాయకురాలు ప్రజల వద్దకు వెళ్తే.. పింఛన్లు రాయట్లేదని ప్రజలు ప్రశ్నించారు. ఆమె ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కావడంతో అయితే.. నాకు మీరు సమస్యలు చెప్పకండి.. జరుగుతున్న ప్రయోజనం గురించి వివరించండి అని అన్నారు.
దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రజలు.. ``ఏదైనా ఉంటే సీఎం తోనే చెబుతాం.. నీకు చెప్పం`` అన్నారు. అక్కడితో కూడా ఆగకుండా.. నిన్ను చూసి ఓటేయలేదు.. చంద్రబాబు, లోకేష్లను చూసి ఓటేశామని చెప్పుకొచ్చారు. ఇది ఎమ్మెల్యేకి శరాఘాతంగా తగిలింది. ఇదే విషయంపై తన వారితో నియోజకవర్గంలో చర్చ పెట్టారు. దీనికి ఔననే సమాధానమే వచ్చింది. చంద్రబాబు కోసం.. నారా లోకేష్ కోసమే ఓట్లు వేసి గెలిపించామని మెజారిటీ ప్రజలు చెప్పినట్టు తెలిపారు.
ఇక, గుంటూరు విషయంలోనూ.. ఇదే వినిపించింది. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలోని చాలా నియోజ కవర్గాల్లో ఎమ్మెల్యేల కంటే కూడా.. చంద్రబాబు, లోకేష్లను చూసి ఓటేసినట్టు తేలిపోయింది. జనసేన గెలిచిన చోట కూడా ఇలానే జరిగినట్టు చెబుతున్నారు. మొత్తంగా గత ఎన్నికల్లో చాలా మంది కొత్త వారు.. అసలు గెలుస్తుందో గెలవదో అనుకున్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ, జనసేనలు విజయం దక్కించుకున్నాయి. కొత్త మొహాలు కూడా గెలుపు గుర్రం ఎక్కాయి.
దీనికి కారణం.. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఫేస్ వాల్యూతోనే గెలిచినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ విషయంలో మంచిదే కదా? అనే అవకాశం ఉంది. కానీ, నాయకులు తమను తాము తప్పించుకు నేందుకు ఈ మాటే చెబుతున్నారు. తమను చూసి ఓటేయనప్పుడు.. తాము ప్రజల్లోకి వెళ్లినా ప్రయోజనం లేదని కొందరు తెలివి ప్రదర్శిస్తున్నారు. మరికొందరు.. ఇప్పుడు వెళ్లినా.. చేసేది ఏముంది.. అంతా డైరెక్టుగా చంద్రబాబు చూసుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తానికి ఎమ్మెల్యేలు తప్పించుకునేందు కు పలు మార్గాలను ఎంచుకుంటున్నారన్నది పార్టీల్లో చర్చగా మారింది.