ఆకలి చావులు- నీటికొరత-ఆర్థిక దివాళా.. 2026- L నినో పెను విధ్వంశం?!
కేవలం ఆయిల్ క్రైసిస్ తో ఇప్పటికే గొప్పగా అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకుంటున్న భారతదేశం సైతం అల్లాడిపోతోంది.
ఆకలి చావులు- నీటికొరత-ఆర్థిక సంక్షోభం వంటి తీవ్ర పరిణామాలను ఈ మానవ ప్రపంచం చూడబోతోందా? 2026 -27 సీజన్ కరువు కాటకాలతో అల్లాడనుందా? అంటే అవుననే వాతావరణ శాఖ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ పత్రికలలో ఇప్పటికే వెలువడిన పలు కథనాలను విశ్లేషిస్తే.. 2026లో రానున్న సూపర్ ఎల్.నినో. శాతాబ్ధాల కాలంలో మాత్రమే దాపురించే దుర్భేధ్యమైన కరువు కాటకాలకు తెర తీసే ఒక పెనుముప్పు అని అంచనా.
ఈ ఎల్ నినో అత్యంత ఇబ్బందికరమైన.. ఆందోళనకరమైన సవాళ్లను తేనుంది. 1876-78 కాలంతో పోలిస్తే నేటి ఆధునిక ప్రపంచం సాంకేతికంగా, శాస్త్రీయంగా ఎంతో ముందుకు వెళ్లినా గ్లోబలైజేషన్ కారణంగా దేశాలన్నీ ఆర్థికంగా ఒకదానితో ఒకటి బలంగా ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో చారిత్రాత్మక స్థాయిని తలపించేలా ఒక భీకర ఎల్ నినో సంభవిస్తే.. అది కేవలం ఒక ప్రాంతీయ వాతావరణ విపత్తుగా మిగిలిపోకుండా.. ఆధునిక అంతర్జాతీయ రవాణా, వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపి ఆర్థిక, సామాజిక స్థిరత్వాన్ని తీవ్రంగా కుదిపేసే భారీ సంక్షోభంగా మారే ప్రమాదం పొంచి ఉన్నట్టేనని పాపులర్ `డౌన్ టు ఎర్త్ డాట్ ఓఆర్జి` వెబ్ సైట్ తన కథనంలో విశ్లేషించింది. సదరు వెబ్ కథనం ప్రకారం... విశ్లేషిస్తే తెలిసిన విషయాలు ఇలా ఉన్నాయి.
మొదటిగా అంతర్జాతీయ ఆహార సరఫరా గొలుసు ఈ విపత్తు వల్ల పూర్తిగా కుప్పకూలే అవకాశం ఉంది. నేటి ఆధునిక ఆహార వ్యవస్థ కొన్ని ప్రధాన దేశాల ఎగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి నడుస్తోంది. ఎల్ నినో వల్ల ఆసియాలో తీవ్ర కరవు ఏర్పడి వరి, గోధుమలు, చెరకు వంటి ప్రధాన పంటల దిగుబడి పడిపోతే సదరు దేశాలు తమ సొంత ప్రజల అవసరాల కోసం ఎగుమతులపై ఆంక్షలు విధించే `ఆహార జాతీయవాదం` తెరపైకి వస్తుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో నిత్యావసరాల కొరతను సృష్టించి... ధరలను ఆకాశానికి పెంచడమే కాకుండా.. ఎగుమతి దిగుతులపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక పనామా కాలువ వంటి కీలక జలమార్గాల్లో నీటి మట్టాలు తగ్గి ఓడల రవాణా నిలిచిపోయేలా చేస్తుంది.
రెండవది.. ఈ ఆహార కొరత నేరుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను `స్టాగ్ఫ్లేషన్` (ఆర్థిక వృద్ధి మందగించి, ద్రవ్యోల్బణం పెరగడం) వైపు వేగంగా నెడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల వచ్చే `అగ్రి-ఫ్లేషన్` కేవలం పేద దేశాలనే కాకుండా.. అభివృద్ధి చెందిన దేశాలలోని మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని కూడా పూర్తిగా దెబ్బతీస్తుంది. దీనికి తోడు... విపరీతమైన వేడి వల్ల ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగి ఇంధన సంక్షోభం తలెత్తుతుంది. అలాగే వరదలు- అడవి మంటల వల్ల కలిగే నష్టాలకు అంతర్జాతీయ బీమా కంపెనీలు భారీగా క్లెయిమ్లు చెల్లించాల్సి రావడంతో గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతాయి.
మూడవది... ఆఫ్రికా, దక్షిణాసియా, లాటిన్ అమెరికాలోని వెనుకబడిన.. తక్కువ ఆదాయం గల పేద దేశాల మనుగడపై ఈ ప్రభావం అత్యంత ఘోరంగా ఉంటుంది. ఆధునిక గ్లోబల్ రిలీఫ్ నెట్వర్క్స్ - సాంకేతికత వల్ల 1876-78 నాటి పరిస్థితుల్లానే ప్రత్యక్షంగా కోట్లాదిగా ఆకలి చావులు సంభవించకపోవచ్చు. కానీ తీవ్రమైన పోషకాహార లోపం, మంచినీటి కొరత, అంటువ్యాధులు ప్రజారోగ్యాన్ని అతలాకుతలం చేస్తాయి. వ్యవసాయం, బతుకుదెరువు కోల్పోయిన లక్షలాది మంది గ్రామీణ ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం కోసం సరిహద్దులు దాటి పర్యావరణ శరణార్థులుగా ఇతర దేశాలకు వలస వెళ్లడం వల్ల అంతర్జాతీయ మానవతా సంక్షోభం తలెత్తుతుంది.
ఈ ఆర్థిక, సామాజిక ఒత్తిళ్లు అంతిమంగా తీవ్రమైన రాజకీయ అస్థిరతకు, అంతర్గత అల్లర్లకు దారితీస్తాయి. చరిత్రను గమనిస్తే... నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ తప్పినప్పుడు .. ఆకలి కేకలు పెరిగినప్పుడు అనేక దేశాలలో ప్రభుత్వాలపై ప్రజావ్యతిరేకత వ్యక్తమై అంతర్యుద్ధాలు, రాజకీయ తిరుగుబాట్లు జరిగాయి. ఇప్పటికే వాతావరణ మార్పుల వల్ల భూమి మునుపటి కంటే చాలా వేడెక్కి ఉన్న తరుణంలో ఈ స్థాయి భీకర ఎల్ నినో తోడైతే అది అంతర్జాతీయ శాంతి భద్రతలను సైతం పరీక్షకు గురిచేస్తుంది. దీనిని తట్టుకోవాలంటే కేవలం స్థానిక సంసిద్ధత మాత్రమే సరిపోదు... ప్రపంచ దేశాల మధ్య తక్షణ వనరుల భాగస్వామ్యం.. సమగ్ర అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఎంతో అవసరం.
ముంచుకొస్తున్న చారిత్రాత్మక ముప్పు:
ప్రపంచ వాతావరణ చరిత్రలోనే అత్యంత భీకరమైనదిగా భావించే రికార్డులను తిరగరాస్తూ 2026 ఎల్ నినో ప్రక్రియ పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణ వేగంతో అభివృద్ధి చెందుతోంది. అమెరికాకు చెందిన `నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్` (ఎన్.వో.ఏ.ఏ) తాజా కథనం ప్రకారం.. ఈ ఏడాది మే -జూలై నెలల మధ్య ఎల్ నినో ఏర్పడటానికి ఏకంగా 82 శాతం అవకాశం ఉంది. ఈ వేడి వాతావరణ పరిస్థితులు 2026 సంవత్సరం చివరి నాటికి మరింత బలపడి 2027 ప్రారంభం వరకు కొనసాగవచ్చని ముందస్తు అంచనాలు హెచ్చరిస్తున్నాయి. కొన్ని వాతావరణ నమూనాలు ఓషియన్ నినో ఇండెక్స్ ఏకంగా 3డిగ్రీల సెంటిగ్రేడ్ మార్కును దాటవచ్చని సూచిస్తున్నాయి. వాతావరణ రికార్డుల చరిత్రలో గతంలో 1878 జనవరిలో కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ఈ స్థాయి తీవ్రత నమోదైంది. నాటి భీకర ఎల్ నినో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన కరవు, తీవ్ర ఆహార సంక్షోభం - లక్షలాది ఆకలి చావులకు దారితీసింది.
ఈ పవర్ఫుల్ ఎల్ నినో కారణంగా అంతర్జాతీయంగా విపరీతమైన ఉష్ణోగ్రతలు, అడవి మంటలు, సముద్ర పగడపు దిబ్బలు నశించిపోవడం వంటి తీవ్ర పర్యావరణ నష్టాలు వాటిల్లనున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది నేరుగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే కాకుండా.. అంతర్జాతీయ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లి ప్రజారోగ్యాన్ని అతలాకుతలం చేసే ప్రమాదం ఉంది. చరిత్రలోకి వెళితే 1876-78 నాటి వాతావరణ సంక్షోభ పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం ఆధునిక ప్రపంచం సాంకేతికంగా మెరుగైన సంసిద్ధతతో ఉన్నా.. ఈ స్థాయి విపత్తును తట్టుకోవడం అంత సులువు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సుదీర్ఘ విపత్కర పరిస్థితుల వల్ల అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు.. ప్రభుత్వాలు తీవ్రమైన వనరుల కొరతను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున తక్షణమే ప్రజలు ఎవరికి వారే తగినన్ని నిధులను, వ్యూహాత్మక ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కేవలం ఆయిల్ క్రైసిస్ తో ఇప్పటికే గొప్పగా అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకుంటున్న భారతదేశం సైతం అల్లాడిపోతోంది. కరోనా క్రైసిస్ ని తట్టుకున్నా ఆయిల్- గ్యాస్ క్రైసిస్ ని ఎలా తట్టుకోవాలో అర్థం కాని గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో ద్రవ్యోల్భణంతో రూపాయి విలువ తగ్గుదలతో దేశం స్థిరత్వం కోల్పోతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కరువు కాటకాలను మోసుకొస్తతున్న ఎల్.నినో ఎలాంటి పెను విఫత్తుగా మారుతుందోననే ఆందోళన నెలకొంది. దీనిని ఎదుర్కొనేందుకు భారత్ ఎలా సిద్ధమవుతుందో చూడాల్సి ఉంది.
(నోట్: పలు జాతీయ అంతర్జాతీయ మ్యాగజైన్లు వెబ్ మాధ్యమాల కథనాల ఆధారంగా ఈ సమాచారం అందించాం)