పంచాయతీ పాలనపై పవన్ ముద్ర... మొత్తం వ్యవస్థనే మార్చేసిన డిప్యూటీ సీఎం

పరిపాలన సంస్కరణల్లో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న క్లస్టర్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలను ఇక మీదట స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పరిగణిస్తారు.;

Update: 2025-10-11 07:36 GMT

కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన ముద్ర వేస్తున్నారు. పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడుతున్న పవన్.. తన శాఖ పరిధిలో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుడుతున్నారు. కీలకమైన పంచాయతీరాజ్ శాఖను ఎంపిక చేసుకున్న పవన్ గ్రామాల అభివృద్ధికి రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. పల్లె పండుగ పేరుతో వేలాది కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణానికి నడుంకట్టిన పవన్.. ఇప్పుడు పంచాయతీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళించాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయతీల్లో పారదర్శకత పాలనకు నూతన విధానాలకు రూపకల్పన చేశారు.

మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం ఆలోచనల ప్రకారం ‘పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి, పౌర సేవలు సక్రమంగా అందేలా పాలన వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని పవన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. కలాం స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకువచ్చేలా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పంచాయతీ వ్యవస్థపై సుదీర్ఘ అధ్యయనం తర్వాత నాలుగు నెలలపాటు నిపుణులతో పలు దఫాలు చర్చించిన పవన్ కీలక సవరణలను ప్రతిపాదించారు.

ఇందులో భాగంగా 10 వేల జనాభా దాటిన పంచాయతీలను ఇకపై రూర్బన్ పంచాయతీలుగా గుర్తిస్తారు. ఈ గ్రామాల్లో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. వీటి పరిధిలో 359 పంచాయతీలు వస్తాయి. నూతన విధానంలో గతంలో ఉన్న క్లస్టర్ విధానం రద్దు చేసి పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా వర్గీకరించనున్నారు. పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారి (పి.డి.ఓ.)గా మార్పు చేశారు.

స్వతంత్ర యూనిట్లుగా 13,351 గ్రామ పంచాయతీలు

పరిపాలన సంస్కరణల్లో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న క్లస్టర్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలను ఇక మీదట స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పరిగణిస్తారు. పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా పునర్ వర్గీకరించారు. గ్రేడ్ 1 పంచాయతీల్లో పని చేస్తున్న 359 మంది కార్యదర్శుల వేతన శ్రేణి పెంపుతోపాటు పదోన్నతిపై డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (డెప్యూటీ ఎం.పి.డి.ఓ.) కేడర్ కల్పిస్తారు. వీరిని 359 రూర్బన్ పంచాయతీల్లో నియమిస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఐదు గ్రేడ్ల పంచాయతీ కార్యదర్శులను మూడు గ్రేడ్లుగా సమీకరిస్తారు. వీరితోపాటు 359 మంది జూనియర్ అసిస్టెంట్/జూనియర్ అసిస్టెంట్-కమ్-బిల్ కలెక్టర్ల వేతన శ్రేణి పెంపుతోపాటు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు. మెరుగైన పరిపాలన అందించేందుకు వీలుగా వీరిని రూర్బన్ గ్రేడ్ గ్రామ పంచాయతీల్లో నియమిస్తారు. నూతన విధానంలో గ్రామ పంచాయతీల్లో పని చేసే సిబ్బంది కూర్పులోనూ మార్పులు చేశారు.

మున్సిపాలిటీల్లో ఉన్న విధంగా ప్లానింగ్, పారుశుధ్యం, మంచి నీటి సరఫరా, ఆఫీస్ సిబ్బంది విభాగాలు ఏర్పాటు చేస్తారు. అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది జీతభత్యాలు గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి ఇస్తారు. అవసరాన్ని బట్టి ఇంజినీరింగ్, డిజిటల్ అసిస్టెంట్ల సేవలకు వీరిని వినియోగించుకుంటారు. వీరిని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అసిస్టెంట్లుగా కూడా ఉపయోగిస్తారు. గ్రామ సచివాలయం బాధ్యతలతోపాటు భవనాలు, లే అవుట్ల నిబంధనలు వంటి సేవలనూ వీరు అందిస్తారు.

మినిస్టీరియల్, క్షేత్ర స్థాయి పోస్టుల మధ్య పరస్పర ప్రమోషన్లకు అవకాశం కల్పించారు. అందుకు సంబంధించిన సర్వీస్ రూల్స్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంటర్ కేడర్ ప్రమోషన్ల కోసం సిబ్బందికి రెండు వారాలపాటు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఏడాదిపాటు ఆన్ జాబ్ శిక్షణ ఉంటుంది. వీరికి క్షేత్ర స్థాయి అనుభవం, ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి పరిపాలన అనుభవం లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న వేతన శ్రేణిలోనే ఇంటర్ కేడర్ ప్రమోషన్లు అమలవుతాయి. నేరుగా డిప్యూటీ ఎంపీడీఓలుగా నియమితులైన వారు కనీసం మూడు సంవత్సరాల పాటు ప్రాథమిక శిక్షణ పూర్తి చేసి స్పెషల్ గ్రేడ్ పంచాయతీల్లో పంచాయతీ అభివృద్ధి అధికారులుగా పని చేయాలి. సంస్కరణల్లో భాగంగా పంచాయతీ రాజ్ శాఖలో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విభాగంలో అర్హులైన డిజిటల్ అసిస్టెంట్ల సేవలు వినియోగించుకుంటూ గ్రామ పంచాయతీల్లో రికార్డులు, ఆన్ లైన్ ద్వారా పరిపాలనను పర్యవేక్షిస్తారు.

Tags:    

Similar News