పార్లమెంటు అష్టదిగ్భంధం.. రీజనేంటి?
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే.. గతానికి భిన్నంగా ఒకరకంగా ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని విధంగా భద్రతా సిబ్బంది పార్లమెంటును అష్టదిగ్భంధం చేశాయి. దీనికి సంబంధించి పార్లమెంటు నుంచే ప్రత్యేక ఆదేశాలు వచ్చాయని భద్రతా సిబ్బంది చెబుతున్నారు. వాస్తవానికి పార్లమెంటుకు మూడు అంచెల్లో భద్రత ఉంటుంది. ఇప్పుడు దీనిని ఏకంగా ఆరు అంచెలకు పెంచడం గమనార్హం.
సాధారణంగా.. 1) పార్లమెంటు ప్రాంగణంలో భద్రత. 2) పార్కింగ్, ప్రవేశ మార్గాల్లో కఠిన భద్రత. 3) పార్లమెంటు చుట్టూ ఉండే భద్రత. ఈ మూడు సర్వసాధారణంగా ఉంటాయి. అయితే.. ఇప్పుడు వీటితో పాటు.. పార్లమెంటుకు అర కిలో మీటరు దూరంలో ఉన్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. సాధారణ పౌరులు, వాహనాలను వేరే మార్గాల్లోకి మళ్లించాలని ఆదేశాలు అందినట్టు ఢిల్లీ పోలీసు కమిషనర్ పేర్కొన్నారు. అంటే.. పార్లమెంటు చుట్టు పక్కల కాదు.. అరకిలో మీటరు దూరంలో ఎవరూ ప్రయాణించేందుకు, కనీసం నడిచి కూడా వెళ్లేందుకు అవకాశం లేదు.
అలాగే.. ఎలాంటి డ్రోన్లను ఎగురవేయరాదని ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారు. అలానే.. మీడియా పాస్ను మరింత కఠినతరం చేయడం గమనార్హం. ఇలా.. పార్లమెంటును అష్టదిగ్భంధనం చేయడం ఇదే తొలిసారి అని సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వ వాదన ఒకరకంగా ఉంటే.. విశ్లేషణలు మరో విధంగా ఉన్నాయి. ప్రభుత్వ వాదన ప్రకారం.. ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు ఉన్నాయని అందుకే ఇలా భద్రత కల్పిస్తున్నామని చెబుతోంది.
అయితే.. ఈ వ్యవహారంపై విశ్లేషకుల అభిప్రాయం భిన్నంగా ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు వరకు చేపట్టి పాదయాత్రతో పాటు.. మహారాష్ట్ర, పంజాబ్ రైతులు గిట్టుబాటు ధరల కోసం చేపట్టిన ఉద్యమాలు కూడా పార్లమెంటుకు తాకవచ్చన్న కారణంగానే ప్రభుత్వం ముందస్తు అష్టదిగ్భంధం చేసిందని అంటున్నారు. ఇక, పార్లమెంటులో కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. పార్లమెంటు పరిధిలో నిరసనలు, ధర్నాలు, చివరకు ప్లకార్డుల ప్రదర్శనలను కూడా నిషేధించారు. అంతేకాదు.. ఎంపీలు సైతం.. కెమెరాలు ఉన్న గాడ్జెట్స్ను తీసురాకూడదని నిబంధనల్లో పేర్కొనడం గమనార్హం. దీనిపై అనేక విమర్శలు వస్తున్నా.. ప్రభుత్వం మాత్రం సమర్థించుకుంటోంది.