సుమారు రెండు నెలల తర్వాత.. పహల్గాం ఇప్పుడు ఎలా ఉంది?
పహల్గాం ఉగ్రదాడి అనంతరం తాజాగా జమ్మూకశ్మీర్ లో మళ్లీ పర్యాటకుల సందడి మొదలైంది.;

ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో గల బైసరన్ లోయలో పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తూ, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తూ ఉన్నారు. ఇలా.. పెద్దలు, పిల్లల కోలాహలంతో ఆ ప్రకృతి ఒడి మరింత రమణీయంగా, సందడిగా మారిపోయింది. సరిగ్గా ఆ సమయంలో తుపాకీ చప్పుడు వినిపించింది. ఒక్కసారిగా అక్కడున్న ప్రతీ పర్యాటకుడి ఉత్సాహం మొత్తం మారిపోయింది.
ఎటునుంచి వచ్చిందో తెలియదు ఉగ్రమూక, ఏ మూలన నక్కిందో తెలియదు దుష్టమూక.. ఒక్కసారిగా పర్యాటకులపై విచురుకుపడింది రాక్షసమూక. అక్కడున్న మగాళ్ల మతం అడిగింది.. అనంతరం విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది.. ఈ క్రమంలో 26 మంది మహిళల సిందూరాన్ని చెరిపింది! దీంతో.. అప్పటి వరకూ ఉత్సాహంగా ఉన్న ప్రాంతమంతా రక్తసిక్తమైంది.
జమ్మూకశ్మీర్ పర్యాటకంగా సురక్షితం కాదని సందర్శకులను నమ్మించడానికి.. తద్వారా పర్యాటకంపై అధికంగా ఆధారపడిన ప్రాంత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయడానికి ఓ రాక్షస ప్రయత్నాన్ని ఎంచుకుంది. అయితే వారి ప్రయత్నం ఆయుష్షు రెండు నెలలు కూడా లేదు! ప్రస్తుతం పహల్గాంలో సందడి వాతావరణం నెలకొంది.. ప్రకృతి రమణీయానికి పూర్వ వైభవం వచ్చేసింది.
అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం తాజాగా జమ్మూకశ్మీర్ లో మళ్లీ పర్యాటకుల సందడి మొదలైంది. ఇందులో భాగంగా... తాజాగా 16 పర్యాటక ప్రదేశాలు తిరిగి తెరవబడ్డాయని తెలుస్తోంది. ఇందులో 8 జమ్మూలోవి కాగా.. 8 కాశ్మీర్ లోవి! వీటిలో ప్రధానంగా.. బేతాబ్ లోయ, వెరినాగ్, కోకెర్నాగ్, అచాబల్ లోని మొఘల్ తోటలు ఉన్నాయి.
ఈ సందర్భంగా స్పందించిన జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా... పహల్గాం ఉగ్రదాడి తర్వాత మూసివేయబడిన సుమారు నాలుగు డజన్ల సైట్ లను దశలవారీగా తిరిగి తెరుస్తున్నామని ప్రకటించారు. పైగా.. గత నెలలో సీఎం ఒమర్ అబ్దుల్లా.. పహల్గాంలోనే క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి.. పర్యాటకులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
ఇదే సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన కత్రా – శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ పర్యాటక రంగానికి పెద్ద ఊపినిచ్చిందని అంటున్నారు! ఈ సమయంలో.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ బ్రిడ్జ్ పై ప్రయాణించే అవకాశం కోసం పర్యాటకులు క్యూలో ఉన్నారు. దీంతో.. పర్యాటకంగా ఆ ప్రాంతానికి పూర్వ వైభవానికి మించిన మొదలైనట్లేనని అంటున్నారు!