ఈవీఎంలకు కాపలా కాస్తా....మమత సంచలనం
ఇక కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి పూర్తయి తాను ప్రెస్ మీట్ పెట్టేంత వరకూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు పోలింగ్ బూత్ లు వద్ద ఉండాల్సిందేనని మమత స్పష్టం చేశారు.;
మమతా దీదీ అంటే అంటే మజాకానా. కమ్యూనిస్టులతో పదేళ్లకు పైగా పోరాడి అధికారం అందుకున్నారు ఆమె. మూడుసార్లు వరుసగా బెంగాల్ వంటి అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి మమతా బెనర్జీకి చెక్ పెడదామని బీజేపీ తీవ్ర స్థాయిలో యత్నించింది. 2026 లో మాదే బెంగాల్ లో అధికారం అని బీజేపీ గట్టిగా సౌండ్ చేస్తోంది. అయితే మమత మాత్రం బీజేపీకి అంత సీన్ లేదంటోంది. ఈవీఎంలలో ఓట్లు అన్నీ తమవే అని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే బీజేపీ మార్క్ రాజకీయాల మీద ఆమె అనుమానం వ్యక్తం చేస్తూ ఈవీఎంల వద్ద కాపలా ఉండాలని తమ పార్టీ క్యాడర్ కి పిలుపు ఇచ్చారు.
స్ట్రాంగ్ రూములు జర భద్రం :
ఇక బెంగాల్ లో రెండు విడతలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మే 4న కౌంటింగ్ జరుగుతున్న సందర్భంగా ఈవీఎంలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మమతా విజ్ఞప్తి చేశారు ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూముల వద్ద కాపలా ఉండాలని ఆమె పిలుపు ఇచ్చారు వీలైతే తాను కూడా వ్యక్తిగతంగా వీధుల్లోకి వచ్చి మరి ఈవీఎంలు కాపలా కాస్తానని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలలో ప్రజల తీర్పు ఉందని అందుకే జర భద్రం అని ఆమె పార్టీ క్యాడర్ ని కోరారు.
అసలైన రిపోర్టు ఇదే :
ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల మీద మమతా బెనర్జీ తనదైన విశ్లేషణ చేశారు మరోసారి రాష్ట్రంలో అధికారం తృణమూల్ కాంగ్రెస్ దేనని ఆమె స్పష్టం చేశారు. బీజేపీకి ఏమాత్రం రాష్ట్రంలో చోటు లేదని ఆమె పేర్కొన్నారు. ఎర్రటి ఎండను సైతం కాదని ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్ లకు వచ్చి తమ పార్టీకి ఓట్లు వేశారని ఆమె చెప్పారు. బుధవారం మధ్యాహ్నానికే తన వద్దకు అసలైన పోలింగ్ ఫలితాలు వచ్చాయని ఆమె చెప్పడం విశేషం. అయితే బీజేపీ తమ పార్టీ కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే తప్పుడు ఎగ్జిట్ పోల్స్ సర్వేలను విడుదల చేయిస్తోందని ఆమె ఆరోపించారు. మీడియాకు బీజేపీ డబ్బులు ఇచ్చి తప్పుడు ఎగ్జిట్ పోల్స్ సర్వేలను విడుదల చేయించిందని మమత సంచలన ఆరోపణలు చేశారు. అయితే తనకున్న సమాచారం మేరకు తమ పార్టీ నుంచి 226 నుంచి 230 సీట్ల వరకు కచ్చితంగా గెలుచుకుంటుందని, నాలుగవ సారి బెంగాల్ ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేస్తానని మమత ధీమా వ్యక్తం చేశారు.
ఓటమి బీజేపీదే :
ఈసారి కూడా ఎన్నికల్లో ఓటమి చెందుతామని బిజేపీకి ముందే అర్థమైందని అందుకే ఫేక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలను రిలీజ్ చేస్తూ జనాలను మభ్యపెడుతోందని మమత ఆరోపించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కేంద్ర బలగాలు రాష్ట్ర పోలీసులు కలిసి ప్రజల మీద తమ పార్టీ కార్యకర్తల మీద ఎన్ని రకాలైన అఘాయిత్యాలకు పాల్పడినప్పటికీ ప్రజలు మాత్రం తృణమూల్ కాంగ్రెస్ వెంటనే ఉన్నారని మమత పేర్కొన్నారు. అందుకే తమకే వారంతా ఓటు వేశారని అన్నారు. దానికి ప్రజలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నామని ఆమె ప్రకటించారు.
ఏజెంట్లూ కదలొద్దు :
ఇక కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి పూర్తయి తాను ప్రెస్ మీట్ పెట్టేంత వరకూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు పోలింగ్ బూత్ లు వద్ద ఉండాల్సిందేనని మమత స్పష్టం చేశారు. ఏ ఒక్క ఏ పోలింగ్ ఏజెంటు తమ స్థానాల నుంచి కదలొద్దని మమత సీరియస్ గానే ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అత్యవసరం అయి తమ టేబుల్ వద్ద నుంచి వెళ్లాలనుకుంటే కనుక ఆ బాధ్యతలను వేరే వాళ్లకు నమ్మకస్తులను ప్రత్యామ్నాయంగా అప్పగించాలని మమత కోరారు. ఇక బీజేపీ జాతకం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉందని బెంగాల్ ప్రజల తీర్పు ఏమిటో త్వరలో ఆ పార్టీ చవిచూడబోతోందని మమత చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ బూటకమని ఆమె మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న ఈ తరహా రాజకీయాలని బెంగాల్ ప్రజలే తమ తీర్పు ద్వారా తిప్పి కొడతారని మమత చెప్పడం విశేషం.