'టీమ్-11' ఆరోపణలకు లోకేష్ రియాక్షన్ ఇదీ!
వైసీపీ నాయకులు మెగా డీఎస్సీ-2025పై చేస్తున్న ఆరోపణలకు అసెంబ్లీ వేదికగా మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఈ విషయంపై టీమ్ - 11 అనవసర ఆరోపణలు చేస్తోందని ఆయన విమర్శించారు.
వైసీపీ నాయకులు మెగా డీఎస్సీ-2025పై చేస్తున్న ఆరోపణలకు అసెంబ్లీ వేదికగా మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఈ విషయంపై టీమ్ - 11 అనవసర ఆరోపణలు చేస్తోందని ఆయన విమర్శించారు. అత్యంత పకడ్బందీగా డీఎస్సీని నిర్వహించామని ఆయన తెలిపారు. న్యాయపరమైన చిక్కలును కూడా పరిష్కరించి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చినట్టు లోకేష్ తెలిపారు. ``పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. ఎంతో బాధ్యతగా డీఎస్సీని నిర్వహించాం`` అని లోకేష్ చెప్పారు.
కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియను పూర్తిచేసి.. కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగులు కూడా ఇచ్చామన్నారు. ఎక్కడా ఎలాంటి వివాదాలు లేకుండా చేశామన్నారు. వైసీపీ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ వేయలేదని ఆక్షేపించారు. అందుకే.. యువగళం పాదయాత్ర సమయంలో ఎంతో మంది నిరుద్యోగులు తనకు తమ సమస్యలు చెప్పుకొన్నారని అన్నారు. వారి ఆకాంక్షలు తీర్చేందుకు మెగా డీఎస్సీ వేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చామన్నారు.
అన్నట్టుగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేల మందిని నియమించామని లోకేష్ చెప్పారు. తమ ప్రభుత్వం సంస్కరణలు అమలు చేసిందన్నారు. ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలు పారదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని.. ఆయన చెప్పినట్టుగానే చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను లిక్కర్ షాపుల ముందు నిలబెట్టిందని.. తాము విదేశాలకు పంపించి.. వారిని మరింత ప్రోత్సహించామని వ్యాఖ్యానించారు.
336 కోసులు..
తాము నిర్వహించిన మెగా డీఎస్సీపై 336 కేసులు వేశారని లోకేష్ చెప్పారు. ఈ క్రమంలో వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని హైకోర్టు సూచించిందని.. దాని ప్రకారమే దేశంలో ఫస్ట్ టైమ్ ఈ రిజర్వేషన్లను అమలు చేశామన్నారు. టీమ్-11 చేస్తున్న ఆరోపణలపై ఉపాధ్యాయులే స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రభుత్వానికి అండగా నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించేందుకు ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు టీం-11 ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.