చేరికల కమిటీలు ఏం చేస్తున్నాయ్.. జనసేనలో వాట్ హ్యాపెండ్.. ?
వీరి పరిస్థితి ఎలా ఉంది? ఈ కమిటీల ఏర్పాటు తర్వాత.. ఎంతమందినివారు పార్టీలో చేర్చారు? అనేది ప్రశ్న.
చేరికల కమిటీల పేరుతో ఏర్పడు చేసిన కొత్త కమిటీలు ఏం చేస్తున్నాయి? కొత్తవారిని.. పాతతరం నాయకులను చేర్చుకోవడం ద్వారా.. పార్టీని బలోపేతం చేయాలన్న కీలక సంకల్పంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చేరికల కమిటీలను ఏర్పాటు చేశారు. వీటికి బాధ్యులుగా సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు.. బాలినేని శ్రీనివాసరెడ్డి సహా.. సామినేని ఉదయభాను వంటివారిని నియమించారు. వీరి పరిస్థితి ఎలా ఉంది? ఈ కమిటీల ఏర్పాటు తర్వాత.. ఎంతమందినివారు పార్టీలో చేర్చారు? అనేది ప్రశ్న.
ఏ పార్టీకైనా ఆత్మ విచారం అత్యంత ముఖ్యం. కమిటీలను ఏ ర్పాటు చేసి.. చేతులు దులుపుకొంటే.. దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. కమిటీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం.. వాటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో పార్టీ పరంగా వెనుకబడుతున్నారు. కమిటీలు ఏర్పాటు చేసి.. ఇప్పటికి మూడు మాసాలు అయింది. కానీ.. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా పార్టీలో చేర్చుకోలేక పోయారు. ఒక్కరికి కూడా జనసేన కండువా కప్పలేక పోయారు. దీంతో అసలు ఏం జరుగుతోంది? అనేది కీలక ప్రశ్న.
దీనిలో రెండు కోణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
1) పార్టీ పరంగా ఎదురవుతున్న సమస్య లు: ఏ పార్టీలో అయినా.. నాయకులు చేరాలంటే.. పార్టీ ఇమేజ్ అత్యంత కీలకం. ప్రస్తుతం జనసేన పార్టీ కి ఉన్న ఏకైక ఇమేజ్ పవన్ కల్యాణ్. దీనికి మించి క్షేత్రస్థాయిలో పార్టీకి కార్యకర్తల రూపంలో పెద్దగా బలం లేదు. ముందు దీనిని పుంజుకునేలా చేయాల్సినఅవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలానే.. బూత్ స్థాయి కార్యకర్తలను కూడా నియమించుకోవాలి.
2) యూత్: రాబోయే తరానికి రాజకీయ వారసులుగా నేటి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిని ఆకర్షించే ప్రయత్నం చేయాలి. కానీ, ఈ రెండు కూడా సాగడం లేదు. పోనీ.. ఇతర పార్టీలనుంచి వచ్చే వారికోసం వేచి చూస్తున్నారని అనుకున్నా.. వైసీపీ నుంచి వచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చిన వారు వచ్చేశారు. ఇక, వచ్చేవారు లేరు. అందరూ కరడుగట్టిన వైసీపీ అభిమానులే ఉన్నారు. పోనీ.. తటస్థంగా ఉన్న నాయకులు వస్తున్నారా? అంటే.. వారికి హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో జనసేన చేరిక కమిటీల ప్రయత్నం ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది.