జగన్ వర్సెస్ పవన్ : హై ఓల్టేజ్ తో హీటెక్కిన పిఠాపురం !

ఈసీ ఇద్దరికీ అనుమతి ఇచ్చి వేరు వేరు సమయాలు కేటాయిస్తుందా అన్న చర్చ కూడా ఉంది. అదే జరిగితే ఉదయం జగన్ ఎన్నికల సభ సాయంత్రం పవన్ రోడ్ షో పిఠాపురంలో ఉంటాయి.అలా

Update: 2024-05-08 12:36 GMT

ఏపీలో అసలైన ఘట్టానికి తెర లేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాస్ట్ పంచ్ గా పిఠాపురాన్ని ఎంచుకుంటున్నారు. ఈ నెల 11తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దానికి ఒక రోజు ముందు అంటే ఈ నెల 10న పిఠాపురంలో జగన్ సిద్ధం ఎన్నికల సభకు రంగం సిద్ధం చేస్తున్నారు వైసీపీ నేతలు.

అంటే 13న పోలింగ్ ఉండగా పవన్ మీద లాస్ట్ పంచ్ తనదే కావాలని ఆ విధంగా పిఠాపురంలో ఎందరు వచ్చి జనసేనకు అనుకూలంగా ప్రచారం చేసినా కూడా వైసీపీ విక్టరీ కొట్టేటట్లుగా జగన్ భారీ స్కెచ్ గీసారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కాకినాడ దాకా వచ్చిన జగన్ అక్కడే పిఠాపురంలో ఎన్నికల గురించి మాట్లాడారు.

తమ పార్టీ అభ్యర్ధి వంగా గీత రియల్ హీరో అని ఆయన అభివర్ణించారు. ఆమెకు ఓటేస్తే జనాలకు అందుబాటులో ఉంటారని కూడా చెప్పుకొచ్చారు. అదే రీల్ హీరోని గెలిపిస్తే ఇంతే సంగతులు అని కూడా కామెంట్స్ చేశారు. ఇక పిఠాపురానికి జగన్ తప్పకుండా వస్తారని ఆయన ఎన్నికల సభ వేరే లెవెల్ లో ఉంటుందని ఆనాడే వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు.

జగన్ సైతం ఒక పద్ధతి ప్రకారమే ఎన్నికల సభలను నిర్వహిస్తున్నారు. ప్రత్యర్ధులు ఉన్న చోట ఆయన మరింత అటెన్షన్ పే చేస్తున్నారు. అదే విధంగా ఆయన వారిని ఓడించేందుకు సామ దాన భేద దండోపాయాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఏపీలో కుప్పం, హిందూపురం, పిఠాపురం, మంగళగిరిల మీద వైసీపీ టార్గెట్ పెట్టి ఉంచింది అన్నది తెలిసిందే.

Read more!

ఈ నేపధ్యంలో హిందూపురంలో జగన్ ఎన్నికల సభ నిర్వహించారు. ఆయన ఈ నెల 9న మంగళగిరిలో ఎన్నికల సభ నిర్వహిస్తారు అని అంటున్నారు. 11న కుప్పంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల సభ నిర్వహించి జగన్ ఆ మీదట తిరుపతిలో రోడ్ షోతో తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు అని అంటున్నారు.

ఈ క్రమంలో ఈ నెల 10న పిఠాపురం ఎన్నికల సభ అన్నది వైసీపీ షెడ్యూల్ చేసుకుంది. అయితే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా తన సొంత నియోజకవర్గంలో ప్రచారానికి ఒక రోజు ముందుగా భారీ రోడ్ షోను ప్లాన్ చేశారు. ఆయన ఆ రోజు మొత్తం పిఠాపురానికే కేటాయించారు. దాంతో జనసేన నేతలు ఎన్నికల సంఘం అధికారులకు ఈ మేరకు అనుమతులు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు అని అంటున్నారు.

అదే సమయంలో జగన్ ఎన్నికల సభకు దరఖాస్తు చేసుకున్నారా లేదా అన్నది తెలియడం లేదు అని కూటమి నాయకులు అంటున్నారు. అయితే ఎన్నికల సంఘం అధికారులు ఎవరి దరఖాస్తు ముందు వస్తే వారి సభలకే అనుమతి అని అంటున్నారు. మొత్తానికి జగన్ పవన్ లలో ఒకరి సభకే 10న అనుమతి ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.

కానీ ఈ నెల 10 అత్యంత కీలకం కావడం పైగా ఆ రోజు అక్షయ తృతీయ కావడంతో సెంటిమెంట్ తో ఈ రెండు పార్టీల నాయకులు అదే డేట్ కోసం పట్టుపడుతున్నారు. మరి ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక 11కి వాయిదా వేసుకోమని కోరినా ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలతో ప్రచారం ముగించాల్సి ఉంటుంది. దాంతో ఈ డేట్ వెరీ ఇంపార్టెంట్ అని రెండు పార్టీల నేతలు అంటున్నారు.

ఈసీ ఇద్దరికీ అనుమతి ఇచ్చి వేరు వేరు సమయాలు కేటాయిస్తుందా అన్న చర్చ కూడా ఉంది. అదే జరిగితే ఉదయం జగన్ ఎన్నికల సభ సాయంత్రం పవన్ రోడ్ షో పిఠాపురంలో ఉంటాయి.అలా ఒకే రోజు జగన్ వర్సెస్ పవన్ హై ఓల్టేజ్ పొలిటికల్ సీని పిఠాపురం ప్రజలు ప్రత్యక్షంగా ఏపీ ప్రజలు మీడియా సాక్షిగా చూసే అవకాశం ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News