హర్మూజ్ మళ్లీ మూసివేత.. ప్రపంచానికి చమురు సంక్షోభం.. అట్టుడుకుతున్న పశ్చిమాసియా!

ఇరాన్ కేవలం సైనిక స్థావరాలనే కాకుండా, ఒమన్‌లోని వ్యూహాత్మక దుఖ్మ్ ఓడరేవు పై కూడా దాడులు జరిపినట్లు ప్రకటించడం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.

Update: 2026-07-12 07:04 GMT

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న వైరం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరినట్లు కనిపిస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. గల్ఫ్ రీజియన్‌లో అమెరికా సైనిక జోక్యం పూర్తిగా ముగిసేవరకు తమ అనుమతి లేకుండా ఏ ఒక్క నౌకను కూడా ఈ మార్గం గుండా వెళ్లనిచ్చేది లేదని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెగేసి చెప్పింది. ఇరాన్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయంతో అంతర్జాతీయంగా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉద్రిక్తతలకు కారణమైన నౌకపై కాల్పుల ఘటన

ఇరాన్ ఈ అధికారిక ప్రకటన చేయడానికి కొద్ది గంటల ముందే గల్ఫ్ తీరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌక, తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అనధికారిక మార్గంలో ప్రయాణించిందని ఇరాన్ ఆరోపించింది. దీనిపై స్పందించిన ఇరాన్ బలగాలు సదరు నౌకపై కాల్పులు జరిపాయి. ఈ ఘోర దాడిలో నౌకలోని ఓ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. ఈ ఘటనపై అమెరికా రక్షణ మంత్రి తీవ్రంగా స్పందించారు. ఇరాన్ అనాగరిక చర్యలను ఎంతమాత్రం సహించబోమని, దీనికి ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

అమెరికా మూడో విడత దాడులు.. 140 లక్ష్యాలు ధ్వంసం!

రక్షణ మంత్రి హెచ్చరించిన కొద్ది సేపటికే అమెరికా రంగంలోకి దిగింది. ఇరాన్‌పై వరుసగా మూడో విడత భారీ వైమానిక దాడులను ప్రారంభించింది. ఈసారి అమెరికా సైన్యం ముఖ్యంగా హర్మూజ్ తీర ప్రాంతాలు, అలాగే ఇరాన్ వ్యూహాత్మక ప్రాంతమైన బుషెహర్ ప్రావిన్స్‌ను టార్గెట్ చేసింది. ఇరాన్‌కు చెందిన దాదాపు 140 సైనిక, వ్యూహాత్మక లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా వైమానిక దాడుల వల్ల తమ సైనిక స్థావరాలతో పాటు పలు కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా అంగీకరించింది.

అమెరికా బేస్‌లపై ఇరాన్ ప్రతీకార డ్రోన్ దాడులు

అమెరికా దాడులకు ఇరాన్ కూడా అంతే దీటుగా బదులిచ్చింది. గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, బహ్రెయిన్, ఖతార్‌లలోని అమెరికా మిలిటరీ క్యాంపులను తాము విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది.

ముఖ్యంగా ఖతార్‌లోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం 'అల్ ఉదైద్ ఎయిర్ బేస్' లోని కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను తాము నాశనం చేశామని ఇరాన్ ప్రకటించింది. దీనితో పాటు జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్‌పైన కూడా దాడులు చేసినట్లు పేర్కొంది. అయితే ఈ దాడుల తీవ్రతపై అమెరికా గానీ, ఖతార్ గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

భారత్‌కు పెరగనున్న ముప్పు?

ఇరాన్ కేవలం సైనిక స్థావరాలనే కాకుండా, ఒమన్‌లోని వ్యూహాత్మక దుఖ్మ్ ఓడరేవు పై కూడా దాడులు జరిపినట్లు ప్రకటించడం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ పోర్టు భారత్ సహా ఆసియాలోని అనేక దేశాలకు చమురు సరఫరా చేయడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇక్కడ ఉద్రిక్తతలు పెరిగితే భారత్‌కు ఇంధన సరఫరా కష్టతరంగా మారే ప్రమాదం ఉంది.

గ్లోబల్ ఎకానమీపై ప్రభావం ఎంత?

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు ఐదో వంతు 20% కేవలం ఈ హర్మూజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. ఒకవేళ ఇరాన్ గనుక ఈ మార్గాన్ని దీర్ఘకాలం పాటు మూసివేస్తే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరతాయి. షిప్పింగ్ కంపెనీలకు రవాణా వ్యయం, ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారీగా పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా.. ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను ఏ తీరానికి చేరుస్తుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News