జెలెన్ స్కీతో మోదీ.. ఉక్రెయిన్ శాంతికి భారత్ సంకల్పం
అంతర్జాతీయంగా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ప్రయత్నాలు ఊపందుకుంటున్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో కీలకమైన ఫోన్ సంభాషణ జరిపారు;
అంతర్జాతీయంగా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ప్రయత్నాలు ఊపందుకుంటున్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో కీలకమైన ఫోన్ సంభాషణ జరిపారు. ఈ చర్చలు రాబోయే రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య జరగనున్న సమావేశానికి ముందు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
-శాంతియుత పరిష్కారానికే భారత్ కట్టుబాటు
ప్రధాని మోదీ తన 'ఎక్స్' వేదిక ద్వారా ఈ సంభాషణ వివరాలను వెల్లడించారు. "ఉక్రెయిన్లోని తాజా పరిస్థితులపై జెలెన్స్కీతో సమగ్రంగా చర్చించాను. శాంతియుత చర్చల ద్వారా మాత్రమే ఈ సంక్షోభం పరిష్కారం అవుతుందని భారత్ మొదటి నుంచి నమ్ముతోంది. యుద్ధం ముగింపు, శాంతి స్థాపనకు సాధ్యమైనంత వరకు సహకరించేందుకు భారత్ కట్టుబడి ఉంది" అని మోదీ స్పష్టం చేశారు. అంతేకాక భవిష్యత్తులో భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
-జెలెన్స్కీ కృతజ్ఞతలు
అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ చర్చపై స్పందించారు. "ఉక్రెయిన్ ప్రజల పక్షాన మోదీ గారికి నా కృతజ్ఞతలు. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో మా నగరాలు, గ్రామాల దుస్థితిని ఆయనకు వివరించాను" అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక పట్ల భారత్ సానుకూలంగా స్పందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
- ట్రంప్-పుతిన్ భేటీకి ముందు భారత దౌత్యం
గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా ప్రధాని మోదీ పలుమార్లు చర్చలు జరిపారు. "ఇది యుద్ధాల యుగం కాదు" అని పుతిన్తో చెప్పిన మోదీ మాటలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు, ట్రంప్-పుతిన్ భేటీకి ముందు మోదీ-జెలెన్స్కీల సంభాషణ, ప్రపంచ రాజకీయాల్లో భారత్ కీలక దౌత్యపాత్ర పోషిస్తోందని మరోసారి నిరూపించింది. రష్యా నుంచి చమురు దిగుమతులపై ట్రంప్ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో మోదీ-జెలెన్స్కీ చర్చలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ఈ పరిణామాలు, ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారానికి రాబోయే రోజులు నిర్ణయాత్మకంగా మారనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.