పాలస్తీనా కంటే కూడా మనమే దారుణమా? సంచలన రిపోర్ట్
వాస్తవానికి ప్రపంచంలోని 180 దేశాల్లోనే పత్రికా స్వేచ్ఛపై సర్వేలు జరుగుతాయి. మరి మన దేశం 157వ స్థానంలో ఉందంటే ఏమనుకోవాలి?!.;
`విమర్శ లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేం` అంటారు.. అమెరికా తొలి అధ్యక్షుడు అబ్రహాం లింకన్. అందుకే.. అమెరికాలో ఇప్పటికీ ప్రజల స్వేచ్ఛకు పెద్ద పీట వేస్తారు. భావప్రకటన సహా.. నిరసనలకు ప్రపంచంలో పెద్దపీట వేసే దేశంగా అమెరికాకే పేరుంది. మరీ ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ విషయంలో అమెరికా ఇప్పటికీ అగ్రస్థానంలోనే నిలుస్తోంది. మరి భారత్ పరిస్థితి ఏంటి? అంటే.. తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం.. భారత్లో రెండు కీలక అంశాలు.. పతనావస్థలో ఉన్నాయని స్పష్టమైంది.
1) పత్రికా స్వేచ్ఛ: ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచేది పత్రికా స్వేచ్ఛ. ప్రభుత్వం చేస్తున్న పనుల్లోని లోపాలను.. అధికారంలో ఉన్నవారి వ్యవహారాలను.. వారి ఆలోచనా తీరులోని మర్మాలను వెలికి తీసి ప్రజల ముందు ఉంచే గురుతర బాధ్యత పత్రికలదే. అందుకే మన దేశంలో నాలుగో స్తంభంగా ప్రెస్కు పేరుంది. కానీ.. గత దశాబ్ద కాలంగా ఈ స్వేచ్ఛ హరించుకుపోతోందని తరచుగానివేదికలు స్పష్టం చేస్తు న్నాయి. తాజాగా వచ్చిన సర్వేలోనూ భారత్ 157వ స్థానానికి చేరుకుంది.
వాస్తవానికి ప్రపంచంలోని 180 దేశాల్లోనే పత్రికా స్వేచ్ఛపై సర్వేలు జరుగుతాయి. మరి మన దేశం 157వ స్థానంలో ఉందంటే ఏమనుకోవాలి?!. అంటే.. ప్రపంచ దేశాల్లో గురువు పాత్ర పోషిస్తున్నామని చెప్పుకొనే భారత్.. ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని జబ్బలు చరుచుకునే ఇండియాలో దుస్థితి ఇదీ!. నిజానికి ప్రజాస్వామ్య పరిరక్షణ దేశంగా.. నిరంతరం మనపాలకులు ప్రవచనాలు గుప్పిస్తారు. మనకన్నా.. పెద్ద ప్రజాస్వామ్య దేశమే లేదంటారు. కానీ.. మనం ఎంత దారుణంగా ఉన్నామో.. మీడియా స్వేచ్ఛకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామనో రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ సర్వే స్పష్టం చేసింది. ఇదేమీ ఆషామాషీ రిపోర్టు కాదు. దీనిని ప్రపంచ దేశాలు అంగీకరిస్తున్నాయి.
మనం వారికన్నా..
పాలస్తీనా అంటే.. అందరికీ తెలిసిందే కదా!. నిరంకుశత్వం.. తీవ్రవాదం ప్రబలిన దేశంగా ప్రచారంలో ఉంది. అంతేకాదు.. పాలస్తీనాపై యుద్ధం కూడా జరుగుతోంది. అలాంటి దేశం కంటే కూడా మనం వెనుకబడి పోయామంటే ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ మీడియా స్వేచ్ఛ బాగుందని ఈ రిపోర్టు తెలిపింది. అంతేకాదు.. మొత్తం 180 దేశాల్లో మన భారత్ 157 ప్లేస్లో ఉంటే.. నిత్య సంఘర్షణలతో అట్టుడుకుతూ.. అభివృద్ధి మాటే ఎరుగని పాలస్తీనా.. 156వ స్థానంలో ఉండడం గమనార్హం.
మరో చిత్రం ఏంటంటే.. గత ఏడాది మనం ఈ పత్రికా స్వేచ్ఛలో 151వ స్థానంలో ఉంటే.. పాలస్తీనా 163వ ప్లేస్లో ఉంది. కానీ.. ఏడాది తిరిగే సరికి.. పాలస్తీనా.. 156వస్థానానికి ఎగబాకగా.. మనం 157కు దిగజారాం. ఇక్కడ ఇంకో అదిరిపోయే విషయం కూడా ఉంది.. మనం నిత్యం తిట్టిపోసే.. దాయాది దేశం పాకిస్థాన్ మనకంటే మెరుగ్గా పత్రికాస్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి వాల్యూ ఇస్తోందని నివేదిక తెలిపింది. ఈ జాబితాలో పాక్.. 153వ ప్లేస్ లో ఉంది. ఇక, నిన్న మొన్నటి వరకు అల్లర్లతో అట్టుడికిన బంగ్లా దేశ్.. 152వ స్థానంలో ఉండడం గమనార్హం.