భీమిలిలో సెకండ్ టాక్.. గంట మోగట్లేదట.. !
మాజీమంత్రి, సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు వ్యవహారం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.;
మాజీమంత్రి, సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు వ్యవహారం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. గడిచిన 2024 ఎన్నికల్లో ఆయన భీమిలి నుంచి పోటీ చేశారు.. విజయం దక్కించుకున్నారు. అయితే, ఈ టికెట్ అంత సాధారణంగా వచ్చిన విషయం కాదన్నది అందరికీ తెలిసిందే. భీమిలిని సొంతం చేసుకునేందుకు ఆయన ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆ టికెట్ కోసం అనేక రోజులు పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. వాస్తవానికి ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకుడిగా శ్రీనివాసరావుకు మంచి పేరుంది.
ఆయన ఎంపీగా పోటీ చేసినా.. ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. ఎక్కడి నుంచి పోటీ చేసినా.. జిల్లాలతో, నియోజకవర్గంతో కూడా సంబంధం లేకుండా ప్రజలు ఆయనను గెలిపిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అయితే సదరు నియోజకవర్గాల్లో ఆయన అభివృద్ధి ఎంత వరకు చేస్తున్నారు? ఇచ్చిన హామీలను ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారనేది ప్రధానంగా చర్చంగా మారింది. గత 2019 ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచారు. కానీ, అక్కడ ఏమీ చేయలేదు.
దీనికి కారణం నాకు సంబంధం లేని నియోజకవర్గం అప్పగించారనే వాదన వినిపించింది. ఇక ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం పైగా భవిష్యత్తులో తన వారసుడు నిలబెట్టాలనుకుంటున్న నియోజకవర్గం భీమిలి. ఇక్కడ కూడా గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంతవరకు ప్రస్తావించకపోవడం. దానికి అనుగుణంగా చర్యలు లేకపోవడం వంటివి గంట శ్రీనివాసరావు విషయంలో వివాదంగా మారింది. తొలిసారి ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు రావడం. గంట మోగట్లేదు అంటూ పెద్ద పెద్ద వ్యాఖ్యలు అదేవిధంగా రీల్సు కనిపిస్తూ ఉండడం పార్టీలోనే కాదు వ్యక్తిగతంగా గంటా శ్రీనివాసరావు కూడా ఇబ్బందిగా మారింది.
గత ఎన్నికల్లో అనేక హామీలను ఇచ్చారని, నియోజకవర్గ గ్రూప్ మారుస్తామన్నారని, ముఖ్యంగా భీమిలిలో తీర ప్రాంతానికి చెరువులో ఉండే వారికి అనేక హామీలు ఇచ్చారని తెరమీదికి వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఒకటి కూడా అమలు కాకపోవడం, వాటి జోలికి కూడా పోకపోవడం వంటివి `గంట మోగట్లేదు` అనే మాటను బలపరుస్తున్నాయి. మరి దీనిపై ఆయన ఎలాంటి దృష్టి పెడతారు? ఏం చేస్తారనేది చూడాలి.