ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం: దావూద్ ఇబ్రహీం- ISI లింకులున్న ముఠా అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం!

పోలీసు వర్గాల కథనం ప్రకారం.. ఢిల్లీలో విధ్వంసం సృష్టించడమే నిర్దేశిత లక్ష్యంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ చాలా కాలంగా అత్యంత రహస్యంగా ఈ ఉగ్రవాద మాడ్యూల్‌ను అభివృద్ధి చేస్తూ వస్తోంది.

Update: 2026-05-30 18:19 GMT

భారత రాజధాని ఢిల్లీలో భారీ వినాశనానికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI), అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నెట్‌వర్క్ సంయుక్తంగా పన్నిన ఒక పెద్ద ఉగ్రకుట్రను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ శనివారం భగ్నం చేసింది. జాతీయ రాజధానిలోని అత్యంత కీలకమైన ప్రభుత్వ రక్షణ సంస్థలు, భద్రతా సిబ్బంది.. ప్రముఖ ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేస్తున్న తొమ్మిది మంది అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించిన స్పెషల్ సెల్ అధికారులు.. నిందితుల నుండి భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలు, హ్యాండ్ గ్రెనేడ్లు, భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని ఢిల్లీకి పొంచి ఉన్న ముప్పును తృటిలో తప్పించారు.

పోలీసు వర్గాల కథనం ప్రకారం.. ఢిల్లీలో విధ్వంసం సృష్టించడమే నిర్దేశిత లక్ష్యంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ చాలా కాలంగా అత్యంత రహస్యంగా ఈ ఉగ్రవాద మాడ్యూల్‌ను అభివృద్ధి చేస్తూ వస్తోంది. పట్టుబడిన తొమ్మిది మంది నిందితులలో నేపాల్ సరిహద్దుల గుండా దేశంలోకి ప్రవేశించిన నేపాలీ సంతతికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద హ్యాండ్లర్లు, ముంబై అండర్ వరల్డ్ (డి-కంపెనీ) నెట్‌వర్క్‌తో ఈ నిందితులకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు లీగల్ ఏజెన్సీలు గుర్తించాయి. ఈ ముఠాకు అందుతున్న నిధుల మార్గాలు, రిక్రూట్‌మెంట్ పద్ధతులు.. స్థానికంగా వీరికి సహకరిస్తున్న ఫెసిలిటేటర్ల పాత్రపై ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ ప్రస్తుతం సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది.

రాజధానిలో ఈ హైప్రొఫైల్ అరెస్టులు జరగడానికి సరిగ్గా నెల రోజుల ముందే భారత లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు దావూద్ ఇబ్రహీం అంతర్జాతీయ ముఠాపై మరో అతిపెద్ద విజయాన్ని సాధించాయి. దావూద్ నెట్‌వర్క్‌లో అత్యంత కీలకమైన, నమ్మకస్థుడైన అనుచరుడు మహ్మద్ సలీం డోలాను టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో అక్కడి పోలీసులు పట్టుకోగా, భారత ఏజెన్సీలు విజయవంతంగా దేశానికి డిపోర్ట్ చేయించాయి. 2020 నుండి విదేశాలలో పరారీలో ఉన్న సలీం డోలాను ఢిల్లీ టెక్నికల్ ఎయిర్‌పోర్ట్ ద్వారా భారత్‌కు తీసుకువచ్చి, అనంతరం ముంబై ఎన్‌సిబి కస్టడీకి అప్పగించారు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఉన్న డోలా అరెస్ట్.. డి-కంపెనీ అంతర్జాతీయ డ్రగ్స్ సామ్రాజ్యానికి కోలుకోలేని దెబ్బగా మారింది.

ఇటీవల ముంబైలోని కుర్లా ప్రాంతంలో పట్టుబడిన కొందరు డి-కంపెనీ ఏజెంట్లు.. తాము సలీం డోలా ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నామని ఒప్పుకోవడంతో పాటు వారి నుండి 126 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్స్, భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ ఆసియా, యూరప్ దేశాల మీదుగా దావూద్ ఇబ్రహీం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యాపారాన్ని ఏ విధంగా నడుపుతున్నాడనే దానికి సలీం డోలానే కీలక సూత్రధారిగా భావిస్తున్నారు. డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చే కోట్లాది రూపాయల నల్లధనాన్ని హవాలా మార్గాల ద్వారా తిరిగి వ్యవస్థీకృత నేరాలకు, ఉగ్రవాద చర్యలకు ఎలా మళ్లిస్తున్నారో పూర్తి నెట్‌వర్క్ సమాచారం డోలా కస్టడీ ద్వారా పోలీసులకు లభించనుంది.

ఒకే నెల వ్యవధిలో అటు అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్ హెడ్ సలీం డోలాను పట్టుకోవడం... ఇటు ఢిల్లీని వణికించాలనుకున్న ఐఎస్ఐ-దావూద్ ఉమ్మడి ఉగ్ర మాడ్యూల్‌ను చేధించడం.. భారత అంతర్గత భద్రతా సంస్థల పటిష్టతకు నిదర్శనంగా నిలిచింది. ముంబై .. పొరుగు రాష్ట్రాలలో యాక్టివ్‌గా ఉన్న స్లీపర్ సెల్స్, డ్ర‌గ్స్ డిస్ట్రిబ్యూటర్ల గుట్టు విప్పడానికి ఈ తాజా ఆపరేషన్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. సరిహద్దుల అవతల నుండి అండర్ వరల్డ్ మాఫియా - ఉగ్రవాద ముఠాలు కలిసి చేస్తున్న ఈ ప్రమాదకర `నార్కో-టెర్రరిజం` (డ్రగ్స్-ఉగ్రవాదం) కుట్రలను పూర్తిగా నిర్మూలించే దిశగా భారత రక్షణ విభాగాలు తమ ముమ్మర దర్యాప్తును స‌మ‌ర్థంగా చేస్తున్నాయి.

Tags:    

Similar News