లిక్కర్ కేసులో షాకింగ్ అప్డేట్స్.. ఆ ముగ్గురు మళ్లీ జైలుకు?

ఢీఫాల్ట్ బెయిలు పొందిన ముగ్గురు నిందితులు రెండు నెలలుగా బయట ఉన్నారు. అయితే కేసు దర్యాప్తులో ఉండగా, ప్రత్యేక కోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని సిట్ హైకోర్టులో సవాల్ చేసింది.;

Update: 2025-11-20 06:23 GMT

ఏపీ మద్యం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు గతంలో మంజూరైన ఢీపాల్ట్ బెయిలును హైకోర్టు రద్దు చేసింది. సెప్టెంబరులో బెయిలుపై విడుదల ప్రస్తుతం బయట ఉన్న వారు ఈ నెల 26లోగా జైలులో లొంగిపావాలని ఆదేశించింది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిలు కోసం పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం పిటీషన్ లో తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలతో సంబంధం లేకుండా మెరిట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం వెల్లడించాలని సూచించింది.

ఢీఫాల్ట్ బెయిలు పొందిన ముగ్గురు నిందితులు రెండు నెలలుగా బయట ఉన్నారు. అయితే కేసు దర్యాప్తులో ఉండగా, ప్రత్యేక కోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని సిట్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి బుధవారం తీర్పు వెలువరించారు. ముగ్గురు నిందితులు 24వ తేదీలోగా లొంగిపోవాలని తొలుత ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నిందితుల తరపు న్యాయవాదులు అదనంగా రెండు రోజులు గడువు కోరడంతో న్యాయమూర్తి సమ్మతించారు. ఆ మేరకు 26వ తేదీలోగా లొంగిపోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు.

మద్యం స్కాంలో సిట్ దాఖలు చేసిన చార్జిషీటు, అనుబంధ చార్జిషీటు అసంపూర్తిగా ఉన్నాయనే కారణంతో ధనుంజయరెడ్డి (ఏ-31), కృష్ణమోహనరెడ్డి (ఏ-32), బాలాజీ గోవిందప్ప (ఏ-33)కు ఏసీబీ కోర్టు ఈ ఏడాది సెప్టెంబరు 6న నిబంధనలకు విరుద్ధంగా డీఫాల్ట్ బెయిలు మంజూరు చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై సెప్టెంబరు 26న న్యాయస్థానం విచారణ జరిపింది. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఆ ముగ్గురు నిందితులకు సంబంధించి దర్యాప్తు ముగియడంతో తుది చార్జిషీటు దాఖలు చేశామని, ఇతర నిందితుల విషయంలో విచారణ కొనసాగుతోందని ప్రాసిక్యూషన్ మొదటి నుంచి చెబుతోందన్నారు.

సీఐడీ జూలై 19న చార్జిషీటు దాఖలు చేసిన అనంతరం ప్రత్యేక కోర్టు పలుమార్లు నిందితులకు రిమాండ్ పొడిగించింది. ఆ ఉత్తర్వుల్లో చార్జిషీటు దాఖలు చేసినట్లు స్పష్టంగా పేర్కొంది. దీని తర్వాత నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ఆగస్టు 23న ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆఫీసు మెమోరాండం ఆధారంగా చేసుకుని నిందితుల డీఫాల్ట్ బెయిలు పిటిషన్లు వేశారు. వారు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్, డీఫాల్ట్ బెయిల్ వ్యాజ్యాలపై ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసే విషయంలో చట్ట నిబంధనలు అనుసరించలేదని ప్రాసిక్యూషన్ వాదించింది. కాగా, ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని నిందితుల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి బుధవారం తన నిర్ణయం వెల్లడించారు.

Tags:    

Similar News