'మెగా' బ్రేకింగ్... జనసేనానిని గెలిపించమంటున్న చిరంజీవి వీడియో వైరల్!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కి సమయం దగ్గరపడుతున్న వేళ ఒక ‘మెగా’ పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-05-07 06:09 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కి సమయం దగ్గరపడుతున్న వేళ ఒక ‘మెగా’ పరిణామం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా తన తమ్ముడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి ఓటర్లను రిక్వస్ట్ చేశారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. దీంతో... ఇప్పుడు ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది!

అవును... ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. మరో రెండు మూడు రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి ఏపీలో పర్యటిస్తారని.. ఇందులో భాగంగా చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అవుతారని.. అనంతరం, పిఠాపురంలో తన తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఊహాగాణాలు వైరల్ అవుతున్న వేళ చిరంజీవి ఒక వీడియోను విడుదల చేశారు.

ఇందులో భాగంగా... "కొణిదెల పవన్ కల్యాణ్... అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా.. అందరికీ మంచి జరగాలి, మేలు చేయాలనే విషయంలో ముందువాడిగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కల్యాణ్ బాబుది" అని మొదలుపెడుతూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలుచేశారు.

ఇదే సమయంలో... "ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా చేయాలనుకుంటారు. కానీ, కల్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం.. సరిహద్దు దగ్గర ప్రాణాలుఒడ్డి పోరాడే జవాన్ల కోసం పెద్దమొత్తం అందివ్వడం.. అలాగే మత్స్యకారులకు, ఎందరికో చేస్తున్న సాయం చూస్తుంటే.. ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అని అనిపిస్తుంది" అని చిరంజీవి తెలిపారు.

Read more!

అదేవిధంగా... "ఒక రకంగా చెప్పాలంటే తను సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడు. కానీ, రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండే తరుక్కుపోతుంది.. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అవస్థపడుతుంటే, అనవసరంగా మాటలుపడుతుంటే బాదేస్తుంది. అలా బాదపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్య ఒక మాట చెప్పారు " అని చెప్పిన చిరంజీవి పవన్ గురించి కీలక వ్యాఖ్య చేశారు.

ఇందులో భాగంగా తన తల్లితో... "నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ల బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధమమ్మా ఇది.. మన బాధ కంటే అది ఎంతో గొప్పది" అని అన్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో... "అన్యాయాన్ని ఎదురించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లే ప్రజాస్వామ్యం మరింత నష్టమని నమ్మి జనం కోసం జనసైనికుడు అయ్యాడు" అని చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి వెల్లడించారు.

ఇదే క్రమంలో... "తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం, తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్ కల్యాణ్.. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో అతని గొంతు మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు కల్యాణ్ ని గెలిపించాలి" అని చిరంజీవి విన్నవించారు!

అదేవిధంగా... "మీకు సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు, కలబడతాడు, మీ కలలను నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం.. గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి, పవన్ కల్యాణ్ ని గెలిపించండి. జైహింద్" అని చిరంజీవి ముగించారు! ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ వీడియో హల్ చల్ చేస్తుంది!!

4
Tags:    

Similar News