మేయర్ అభ్యర్ధిగా చిన్న శ్రీను కుమార్తె ?
చిన్న శ్రీనుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర కూడా టీడీపీలో చేరారు. ఈ ఇద్దరికీ బాబు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి తీసుకోవడంతో విజయనగరం జిల్లాలో వైసీపీకి బొత్సకు కూడా ఒకే సమయంలో గట్టి షాక్ తగిలింది.
విజయనగరం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటిదాకా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆధిపత్యంతో వైసీపీలో అంతా ఒకటిగా సాగిన రాజకీయం ఇపుడు నిట్ట నిలువునా చీలిపోయింది. మేనమామ బొత్సకు భారీ షాక్ ఇస్తూ మేనల్లుడు చిన్న శ్రీను వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. ఆయనను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎంతో సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చిన్న శ్రీనుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర కూడా టీడీపీలో చేరారు. ఈ ఇద్దరికీ బాబు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి తీసుకోవడంతో విజయనగరం జిల్లాలో వైసీపీకి బొత్సకు కూడా ఒకే సమయంలో గట్టి షాక్ తగిలింది.
మేయర్ సీటు కోసం :
ఇదిలా ఉంటే విజయనగరం మేయర్ రేసులో ఇపుడు టీడీపీ కూటమి నుంచి ఎవరు ఉన్నారో తెలియదు కానీ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా అన్నట్లుగా చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర హాట్ ఫేవరేట్ అభ్యర్ధిగా మారిపోయారు అని అంటున్నారు. ఆమెకు మేయర్ సీటుని ఖరారు చేసిన నేపధ్యంలోనే చిన్న శ్రీను టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అని అంటున్నారు. ఈ మేరకు టీడీపీ అధినాయకత్వం నుంచి గట్టి హామీ లభించింది అని చెబుతున్నారు.
వైసీపీకి దెబ్బ :
ఇక ఒక్కసారి కనుక వెనక్కి వెళ్ళి చూస్తే విజయనగరం మున్సిపాలిటీ కార్పోరేషన్ గా 2021 ఎన్నికలలో అవతరించింది. తొలి మేయర్ గా ఆనాడు వైసీపీ అవకాశాన్ని అందుకుంది. ఇపుడు టీడీపీ కూటమి అధికారంలో ఉండటంతో కచ్చితంగా మేయర్ కూటమికే దక్కుతుందని ధీమా వ్యక్తం అవుతోంది. మేయర్ పదవి కోసం అనేక మంది రేసులో ఉండగా అర్ధబలం అంగబలం దండీగా ఉండడమే కాకుండా జిల్లాలో మంచి పట్టు ఉన్న చిన్న శ్రీను చేరడం కీలక పరిణామం. తన కుమార్తెను ఉన్నత పదవిలో చూడాలని చిన్న శ్రీను చాలా కాలంగా తపిస్తున్నారు. అంతే కాదు విజయనగరం నియోజకవర్గం రాజకీయాల మీద ఆయనకు అవగాహన ఉంది. దాంతో మేయర్ సీటుకే గురి పెట్టి మరీ పసుపు కండువా కప్పుకున్నారు అని అంటున్నారు.
జనసేన కూడా :
అయితే విజయనగరం మేయర్ సీటు మీద జనసేన కూడా కన్ను వేసింది అని అంటున్నారు. ఉత్తరాంధ్రా రీజియన్ లో తమకు జెడ్పీ మేయర్ సీట్లు కావాలని ఆ పార్టీ కోరుతోంది అని అంటున్నారు. ఈ క్రమంలో విజయనగరం మేయర్ పీఠం మీద జనసేన ఫోకస్ పెట్టింది అని చెబుతున్నారు. అయితే విజయనగరం జెడ్పీ స్థానం జనసేనకు ఇస్తారా లేక అనకాపల్లి జెడ్పీ సీటు ఇచ్చి సర్దుబాటు చేసుకుంటారా అన్నది చర్చగా సాగుతోంది. ఏది ఏమైనా చిన్న శ్రీను అధికార పార్టీ బలంతో తనదైన వ్యూహాలతో మేయర్ ఎన్నికల్లో పోటీకి ముందుకు వస్తున్న వేళ వైసీపీ నుంచి ధీటైన అభ్యర్ధులు ఎవరు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. శాషన సభ మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె మేయర్ గా వైసీపీ నుంచి పోటీ చేస్తుందని అంటున్నారు. అయితే బీసీలు అధికంగా కార్పోరేషన్ పరిధిలో వైసీపీ కుల సమీకరణలు బేరీజు వేసుకుని ఎవరిని నిలబెడుతుంది అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.