సగం మంది ఇంటికే.. కూటమి నేతల కలవరం.. !
తమిళనాడులో 20 మందికి పైగా మంత్రులు పరాజయం పాలయ్యారు. పశ్చిమ బెంగాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
కూటమి పార్టీల ఎమ్మెల్యేల్లో కలవరం ప్రారంభమైందా? పొరుగు రాష్ట్రంలో జరిగిన ఎన్నికలఅనంతరం ఏపీలోనూ మార్పుల దిశగా ప్రభుత్వ పార్టీలు ప్రయత్నాలు చేస్తాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపి స్తోంది. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అదికార పార్టీలు కుప్పకూలాయి. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వ పార్టీలు అనుసరించిన విధానం బెడిసి కొట్టింది. ముఖ్యంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొ న్న నాయకులకు కూడా టికెట్లు ఇవ్వడం అధికార పార్టీలపై తీవ్ర వ్యతిరేకతను పెంచేసింది.
తమిళనాడులో 20 మందికి పైగా మంత్రులు పరాజయం పాలయ్యారు. పశ్చిమ బెంగాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కేరళలో అప్పటి సీఎం పినరయి విజయన్ మినహా .. మంత్రి వర్గంలోని 70 శాతం మంది పరాజయం పాలయ్యారు. ఇక, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై నమ్మకంతో స్టాలిన్ టికెట్లు ఇచ్చినా.. వారు కూడా ఓడిపోయారు. ఇలా.. ఈ మూడు పెద్ద రాష్ట్రాల్లోనూ జరిగిన అనుభవాలను జనసేన, టీడీపీ కీలకంగా భావిస్తున్నాయి. వీటిపై అధ్యయనం కూడా చేస్తున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్రంలో పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నారు. 2019లోనూ ఇలానే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వచ్చిన విమర్శలు, ప్రజల్లో వ్యతిరేకతను అంచనా వేయడంలో టీడీపీ విఫలమైంది. చివరి నిముషానికి .. ఎన్నికల సర్వేలు.. వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చినా.. అప్పటికే నామినేషన్ల పర్వం కూడా ముగిసోయింది. దీంతో చంద్రబాబు ప్రజలను బ్రతిమాలుకునే పరిస్థితి వచ్చినా.. వారంతా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం దక్కించుకునేందుకు .. పక్కా ప్రణాళిక ఉండాలని నిర్ణయించుకున్న బాబు.. ఆదిశగానే అడుగులు వేస్తున్నారు.
ఎమ్మెల్యేలు, మంత్రుల గ్రాఫ్ను ప్రతి ఆరుమాసాలకు ఒకసారి తీసుకుంటున్నారు. ప్రజల స్పందన తెలుసుకుంటున్నారు. పనితీరును అంచనా వేసుకుంటున్నారు. ఈ పరిణామం .. టీడీపీలో పైకి కనిపిస్తున్నా.. జనసేనలోనూ అంతర్గతంగా సాగుతోంది. దీంతో సగం మందికి పైగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కించుకునే పరిస్థితి ఆయా నాయకుల చేతిలోనే ఉంటుందంటూ.. నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామం నుంచి బయట పడేందుకు.. ఎమ్మెల్యేలు, మంత్రులు. స్వీయ కార్యాచరణకు దిగాల్సి ఉంటుంది. లేకపోతే.. నాయకుల కోసం పార్టీలను ఫణంగా పెట్టేందుకు ఎవరూ సిద్ధంగా ఉండరన్న విషయం గ్రహించాలి.