పో*ర్న్ సైట్లకు 50వేల సీసీ టీవీల ఫుటేజీలు.. గుజరాత్ హ్యాకర్ కేసులో సంచలన విషయాలు..

మన భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సీసీటీవీ కెమెరాలు ఇప్పుడు మన గోప్యతకే ప్రమాదంగా మారుతున్నాయి.;

Update: 2025-11-04 13:30 GMT

మన భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సీసీటీవీ కెమెరాలు ఇప్పుడు మన గోప్యతకే ప్రమాదంగా మారుతున్నాయి. గుజరాత్‌కు చెందిన హ్యాకర్‌ పరిత్ ధమేలియా చేసిన సీసీటీవీ ఫుటేజీ తస్కరణ దేశవ్యాప్తంగా సంచలనాన్ని కలిగించింది. ఢిల్లీ, ముంబై, నాసిక్‌ వంటి ప్రధాన నగరాల్లోని 50 వేలకు పైగా సీసీటీవీ క్లిప్స్‌ చోరీ చేసి వాటిని పోర్న్ మార్కెట్‌కు విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ ఘటన మన సైబర్ భద్రతా వ్యవస్థల్లో బలహీనతలను బయటపెట్టింది.

సాధారణ పాస్‌వర్డ్‌, పెద్ద విపత్తు

ఈ నేరం వెనుక ఉన్న ప్రధాన అంశం ఒకే పాస్‌వర్డ్‌ ‘Admin123’. విచారణ ప్రకారం, పరిత్‌ తొలుత ఒక హాస్పిటల్‌లోని గైనకాలజీ విభాగం సీసీటీవీ ఫుటేజ్‌ను హ్యాక్‌ చేశాడు. ఆ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి నగరాల్లోని పాఠశాలలు, కళాశాలలు, హాస్పిటల్స్‌ సీసీటీవీల్లో ప్రవేశించాడు. ఒక సాధారణ పాస్‌వర్డ్‌ ద్వారా ఇంత విస్తృతంగా గోప్యమైన వీడియోలపై నియంత్రణ సాధించడం.. సంస్థల సాంకేతిక నిర్లక్ష్యానికి ఉదాహరణ. భద్రత అంటే పరికరాలు కాదు.. అవగాహన, నియంత్రణ అని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

ఫుటేజ్ అమ్మకాలు

దర్యాప్తు వివరాల ప్రకారం.. హ్యాక్ చేసిన ఫుటేజీలలో ఎక్కువ మహిళల దృశ్యాలే. హాస్పిటల్‌ రూమ్‌లు, క్లాస్‌రూమ్‌లు, వసతిగృహాలు గోప్యతకు అర్హత ఉన్న ప్రదేశాలు ఈ నేరం బారిన పడ్డాయి. ఆ వీడియోలు నల్లబజార్‌లో, పోర్న్ సైట్లలో అమ్ముడవుతున్నాయంటే, అది కేవలం చట్ట విరుద్ధ చర్య కాదు.. అది మానవ గౌరవంపై దాడి. ప్రజల వ్యక్తిగత జీవితం ఒక ‘కంటెంట్‌ ప్రోడక్ట్‌’గా మారిపోవడం అత్యంత భయానక విషయం. ఈ ఘటన సమాజం ఎదుర్కొంటున్న సాంకేతిక నేరాల పరిమాణాన్ని గుర్తు చేసింది. పాస్‌వర్డ్‌ ఒకటే మార్గమని నమ్మిన సంస్థలు ఇప్పుడు నైతిక బాధ్యతను ప్రశ్నించుకోవాల్సిన సమయం ఉంది.

అరెస్టు అయినా ఇన్ని నెలలకు..

పరిత్‌ ధమేలియాను పోలీసులు ఫిబ్రవరిలోనే అరెస్టు చేశారు. కానీ దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలు ఇంకా భయానకంగా ఉన్నాయి. సుమారు 50 వేల సీసీటీవీ ఫుటేజ్‌లు చోరీ చేయడం ఒక వ్యక్తి నైపుణ్యంతో సాధ్యమైందంటే.. మన వ్యవస్థల్లోని భద్రతా లోపాలు ఎంత ఉన్నాయో అర్థమవుతోంది. ప్రతీ స్కూల్‌, హాస్పిటల్‌, పబ్లిక్‌ ఇనిస్టిట్యూషన్‌ సీసీటీవీ నెట్‌వర్క్‌లు సెక్యూరిటీ ఆడిట్‌ చేయించుకోవాలి. ఎన్‌క్రిప్షన్‌, మల్టీ లాగిన్‌ వెరిఫికేషన్‌, పాస్‌వర్డ్‌ అప్‌డేట్‌ లాంటి ప్రాథమిక చర్యలు తప్పనిసరి.

సాంకేతికతకు సరిహద్దులు పెట్టాల్సిన సమయం

సీసీటీవీ అంటే భద్రతకు ప్రతీక. కానీ అది హ్యాక్‌ అయిన క్షణంలోనే మనం చూస్తున్న ప్రపంచం మనవైపు తిరిగి చూస్తుంది అనేందుకు ఈ ఘటన ఒక హెచ్చరిక సాంకేతికతను మనం ఉపయోగించాలి, అది మనల్ని కాదు. ప్రభుత్వం ఇప్పుడు సైబర్‌ సెక్యూరిటీ విధానాలను కఠినతరం చేయాలి. ప్రతి పబ్లిక్‌ ఇనిస్టిట్యూషన్ కోసం పాస్‌వర్డ్‌ మేనేజ్‌మెంట్‌ గైడ్‌లైన్లు, సర్వర్‌ మానిటరింగ్‌ సిస్టమ్స్‌ ఉండాలి. ప్రజల అవగాహన కూడా అవసరం. గోప్యత అంటే కేవలం హక్కు కాదు. అది జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత మనదే.

Tags:    

Similar News