అభ్యర్థి చేసిన పని... బీఆర్ఎస్ .. పరువు తీసిందిగా!
ఏ ఎన్నికల్లో అయినా.. గెలుపు-ఓటములు కామన్. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ అదే జరిగింది. అనేక మంది నాయకులు పార్టీల మద్దతుతో రంగంలోకి దిగారు.;
ఏ ఎన్నికల్లో అయినా.. గెలుపు-ఓటములు కామన్. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ అదే జరిగింది. అనేక మంది నాయకులు పార్టీల మద్దతుతో రంగంలోకి దిగారు. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ల గుర్తులు, జెండాలు, అజెండాలు ఉండవు. అయినా.. ఈ దఫా జెండాలు తప్ప.. అజెండాలు స్పష్టంగా కనిపించాయి. ఎవరు ఏ పార్టీ అభ్యర్థి అనేది కూడా స్పష్టమైంది. దీంతో ప్రజలు తాము అనుకున్న వారికి ఓటేశారు. ఇక, ఎన్నికలకు ముందు సొమ్ముల పంపిణీ షరా మామూలుగా మారింది.
అయితే.. ఈసారి ఎన్నికల అనంతరం.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓడిపోయిన అభ్యర్థులు తమ సొ మ్ములు తిరిగి ఇవ్వమంటూ.. ఓటర్లను అభ్యర్థించారు. కొందరు డిమాండ్ చేశారు. మరికొందరు సెంటి మెంటును రాజేశారు. ''దేవుడిపై ప్రమాణం చేసి.. నాకే ఓటేశామని చెప్పండి!'' అంటూ..దేవుడి పటాలను పట్టుకుని ఇంటింటికీ తిరిగారు. అయితే.. జనాలు కొందరిని పట్టించుకున్నారు.. మరికొందరిని పక్కన పెట్టారు.
ఈ క్రమంలో ఓ అభ్యర్థి చేసిన పని.. బీఆర్ఎస్ పరువు తీసిందన్న వాదన వినిపించేలా చేసింది. నల్లగొండ జిల్లా,నార్కట్పల్లి మండలంలోని ఔరవాని పాలెం పంచాయతీ పరిధిలో పోటీ చేసిన బీఆర్ ఎస్ మద్దతుదారు.. కల్లూరి బాలరాజు.. చిత్రమైన పనిచేశాడు. ఈ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యాడు. ఏకంగా 450 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. దీంతో ఆయన శనివారం ఉదయం దేవుడి పటాన్ని పట్టుకుని గ్రామంలో ఇంటింటికీ తిరిగాడు.
ఒక పక్క రోదిస్తూ.. మరోవైపు.. ''మీరు నాకు ఓటేశారా?'' అని అడిగి.. ఆ వెంటనే ''ఓటు వేస్తే.. దేవుడిపై ప్రమాణం చేసి చెప్పండి. వేయకపోతే.. నేనిచ్చిన సొమ్ము ఇచ్చేయండి. నేను అప్పు చేసి 10 రూపాయల వడ్డీకి తీసుకువచ్చి మీకు ఇచ్చా. నన్ను అప్పుల పాలు చేయకండి. మా పార్టీ రూపాయి కూడా ఇవ్వలేదు.'' అని విలపించాడు. దీంతో కొందరు ''పాపం'' అనుకున్నారో ఏమో.. వెంటనే సొమ్మును తిరిగి ఇచ్చారు. ఇలా.. మొత్తం ఆయన 4 వేల 200 రూపాయలు వసూలు చేసుకున్నారు. కానీ, ఇది బీఆర్ఎస్ పార్టీకి మచ్చలా.. మారిందన్న టాక్ వచ్చేలా చేసింది.