ఆ సీటు మీద ఫోకస్ పెట్టిన బొత్స ?

బొత్స అయిదు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచి ఆ మూడు సార్లూ మంత్రిగా పాలించి శాసించిన నియోజకవర్గం చీపురుపల్లి.

Update: 2026-05-19 07:30 GMT

విజయనగరం జిల్లాలో వైసీపీకి సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న మాజీ మంత్రి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ రాజకీయాలకు విరామం ప్రకటిస్తారు అని ఒక వైపు ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దాంతో పాటుగా ఆయన కూడా మీడియా ముందుకు రావడం లేదు, రాజకీయ ప్రకటనలు లేవు, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా ఆయన వెళ్ళి చాలా రోజులు అవుతోంది అని అంటున్నారు. ఆయన వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు అని అనుచరులు చెబుతున్నారు. మరో వైపు ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారని కూడా ప్రచారం అయితే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే వచ్చే ఎన్నికల నాటికి తన వారసులను రంగంలోకి దించాలని బొత్స చూస్తున్నారు. ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఇంకా రాజకీయంగా ఉన్నది అందుకోసమే అని చెబుతున్నారు.

చీపురుపల్లి మీదనే అంతా :

బొత్స అయిదు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచి ఆ మూడు సార్లూ మంత్రిగా పాలించి శాసించిన నియోజకవర్గం చీపురుపల్లి. పైగా బొత్స అనుచర వర్గం బంధు వర్గం గణనీయంగా అక్కడ ఉంది. దాంతో ఆయన ఆ సీటు మీద మమకారం వదులుకోవడం లేదు అని అంటున్నారు. తాజాగా వైసీపీ పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. చీపురుపల్లిలో అయితే బొత్స వైసీపీ ఇంచార్జిగా ఉన్నారు. అక్కడ ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ఆయన తన పార్టీ వారికి తగిన సూచనలు చేశారని అంటున్నారు. ఎక్కడా పార్టీ పట్టు తగ్గకూడదు అన్నట్లుగా బొత్స ఈ సీటు విషయంలో వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

వారిద్దరిలో ఎవరు :

ఇదిలా ఉంటే బొత్స కుమారుడు కుమార్తె ఇద్దరూ డాక్టర్లే. ఇద్దరూ రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారే. ఇక కుమార్తె అయితే చీపురుపల్లి లో పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్నారు. తండ్రితో పాటే పార్టీ సమావేశాలలో నిన్నటిదాకా పాలుపంచుకుని ఉన్నారు. ఆమె చూపు 2029 ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని అంటున్నారు. మరో వైపు చూస్తే కుమారుడిని అక్కడ దింపాలని బొత్స ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. బొత్స కుటుంబం తీసుకుంటే మొత్తం అందరూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా జిల్లా పరిషత్తు చైర్మన్లుగా ఉన్న వారే. దూరపు బంధువుల నుంచి సన్నిహితుల నుంచి బొత్స సతీమణి, తమ్ముడు మేనల్లుడు ఇల్లా అందరూ రాజకీయంగా ఉన్నత స్థానాలకు చేరుకున్న వారే అని అంటున్నారు.

చక్రం తిప్పుతారు :

దాంతో నాలుగు దశాబ్దాల పాటు జిల్లా రాజకీయాలను గుప్పిట పట్టిన బొత్స ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్ వంటి పదవిని నిర్వహించి ముఖ్యమంత్రి పదవి దాకా వచ్చిన ఆయన తన రాజకీయ వారసులను దించకపోతే ఎలా అన్న చర్చ అభిమానులలో ఉంది. బొత్స సైతం అదే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆయన ప్రత్యేకంగా చీపురుపల్లి మీద ఫోకస్ పెట్టారని అంటున్నారు. అక్కడ తన వారసులకు టికెట్ ఇప్పించుకోవడంతో పాటు తాను అనుకున్న వారికే 2029 ఎన్నికల్లో కీలక నియోజకవర్గాలలో సీట్లు దక్కేలా చక్రం తిప్పుతారు అని అంటున్నారు. అయితే ఆయన గతంలో మాదిరిగా రాజకీయంగా దూకుడు చేయరని క్రియాశీలకంగా ఏ మేరకు ఉంటారన్నది త్వరలోనే తెలుస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా చీపురుపల్లిలో మాత్రం బొత్స వారసులే ఉంటారని గట్టిగా వినిపిస్తున్న మాటగా ఉంది.

Tags:    

Similar News