నామినేషన్ పూర్తి... ఎన్నిక లాంఛనం!
ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేశారు.
ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తం నాలుగు స్థానాల్లో ఒకటి మిత్రపక్షం జనసేనకు కేటాయించగా.. మూడు స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఆయా స్థానాల్లో జనసేన అభ్యర్థి లింగమనేని రమేష్.. రెండు రోజుల క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన టీడీపీ అభ్యర్థులు చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్లు సోమవారం తమ నామినేషన్ల పత్రాలను దాఖలు చేశారు.
వేడుకగా..
నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమాన్ని టీడీపీ అభ్యర్థులు వేడుకగా నిర్వహించారు. తొలుత రాజధాని అమరావతిలోని వెంకట పాలెంలో ఉన్న శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం.. నామి నేషన్ పత్రాలతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సైకిళ్లపై ర్యాలీగా చేరుకున్నారు. అన్నగా రు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత.. నామినేషన్ పత్రాలతో అసెంబ్లీలోని ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకుని ఆయనకు వాటిని అందించారు.
కాగా.. ఒక్కొక్క అభ్యర్థినీ 10 మంది ఎమ్మెల్యేలు బలపరుస్తూ.. తమ సంతకాలు చేశారు. నామినేషన్ పత్రా ల దాఖలు సమయంలో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలి వచ్చారు. విశాఖపట్నం నుంచి దాదాపు 30 కార్లలో విజయ్ అనుచరులు తరలి వచ్చి.. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. భాష్యం విద్యా సంస్థల నుంచి అధికారులు, సిబ్బంది తరలి వచ్చారు. మొత్తంగా నామినేషన్ కార్యక్రమం భారీ వేడుకను తలపించింది.
లాంఛనమే..
దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న24 రాజ్యసభసీట్లకు నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసిం ది. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈ నెల 18న జరగనుంది. అన్ని రాష్ట్రాల్లోనూ.. అసెంబ్లీ సభ్యులు ఆయా అభ్యర్థులకు ఓట్లు వేయనున్నారు. ఈ క్రమంలో ఏపీలో కూటమిసర్కారుకు భారీ బలం ఉన్న నేపథ్యంలో టీడీపీ, జనసేన అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే కానుంది. అసలు.. వారి ఎన్నికకు పోలింగ్తో కూడా పనిలేదు. ఎందుకంటే.. పోటీలో ఇతర అభ్యర్థులు కూడా లేని నేపథ్యంలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు వారిని ప్రకటించనున్నారు.