ఉద్యోగుల ఛాయిస్ బాబా..? జగనా.. ?
గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. కూటమికి అనుకూలంగా ఓటేశారు. దాదాపు 12 లక్షల మందికిపైగా ఉన్న ఉద్యోగులు, పోలీసులు కూడా.. కూటమి వైపు నిలిచారు.
గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. కూటమికి అనుకూలంగా ఓటేశారు. దాదాపు 12 లక్షల మందికిపైగా ఉన్న ఉద్యోగులు, పోలీసులు కూడా.. కూటమి వైపు నిలిచారు. ఇది ఆ ఎన్నికల్లో పార్టీకి ఎంతో మేలు చేసింది. కొందరు అంటే.. 20 శాతం మేరకు మాత్రమే అప్పట్లో వైసీపీకి అనుకూలంగా ఉన్నా రు. కానీ.. మిగిలిన వారంతా కూటమికి అనుకూలంగా పనిచేశారు. అప్పట్లో ప్రధానంగా వైసీపీ అనుసరించి న విధానాలను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు.
వీటిలో సీపీఎస్(కాంపెన్సేటరీ పెన్షన్ స్కీమ్)ను ఉద్యోగులు వ్యతిరేకించారు. దీనికి 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీ కీలకమైంది. అదేసమయంలో ఉద్యోగలకు సరైన సమయంలో జీతాలు ఇవ్వకపోవడం.. వారు దాచుకున్న సొమ్మును కూడా ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేయడం.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన ఉద్యమాలను అణిచివేశారన్న వాదన కూడా అప్పట్లో బలంగా పనిచేసింది. ఫలితంగా వైసీపీకి ఉద్యోగులు దూరమయ్యారు.
మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అనేదికూడా ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న ప్పటికీ.. కూటమి పార్టీలపై ఉద్యోగుల అభిప్రాయం చాలా కీలకంగా మారింది. అయితే.. వాస్తవానికి గతంలో ఉన్న సమస్యలే ఇప్పుడు కూడా ఉన్నాయి. వాటిలో మార్పు రాలేదని ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాదు.. గతంలో ముఖ్యమంత్రి దర్శనం లభించలేదన్న వాదన ఉంది. ఇప్పుడు కూడా అలానే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అదేసమయంలో పీఆర్ సీ వేయాలని కోరుతున్నారు.
అలానే.. సీపీఎస్రద్దు విషయంపై ఇప్పటికీ అలానే ప్రతిపాదన ఉంది. మరోవైపు.. వేతనాల విషయంలో నూ ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు అంతర్గతంగా కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా గత వైసీపీ హయాంలో తీసుకువచ్చిన ముఖ హాజరు, యాప్ల తో విసిగిపోయిన వారు.. వాటిని తీసేయాలని కోరుకున్నారు. కానీ, వాటినే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దీంతో ప్రస్తుతం కూటమిప్రభుత్వం అలెర్టు కావాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కు సమయం ఉన్న నేపథ్యంలో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని ఉద్యోగుల ఓటు బ్యాంకును కాపాడుకోవాలి.