యాంకర్ శ్యామలకు పంచ్ లు మొదలయ్యాయి!

అందుకే అంటారు రాజకీయ రొచ్చులోకి ఎందుకని. ఎవరైనా కావొచ్చు.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే.. తీవ్రమైన మాటల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Update: 2024-05-07 05:15 GMT

అందుకే అంటారు రాజకీయ రొచ్చులోకి ఎందుకని. ఎవరైనా కావొచ్చు.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే.. తీవ్రమైన మాటల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే.. సున్నిత మనస్కులకు రాజకీయాలు ఏ మాత్రం సూట్ కావని.. వీలైనంత దూరంగా ఉండటం మంచిదన్న సలహా తరచూ చేస్తుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వెనుకా ముందు చూసుకోవటం.. ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవటం అన్నది ఉండకూడదు. తాము చేయాలనుకున్నది చేసుకుంటూ పోవటమే తప్పించి ఇంకేం ఉండొద్దు. అలా ఉంటే.. కంటిన్యూ కావటం కష్టం. ఏపీలో అధికార వైసీపీ తరఫున ప్రచారం చేయటానికి రంగంలోకి దిగారు యాంకర్ శ్యామల.

ఆమె పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. వైఎస్ జగన్ కు తన మద్దతు తెలుపుతున్నారు. వచ్చామా? ప్రచారం చేశామా? వెళ్లిపోయామా? అన్నట్లు కాకుండా.. తన ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ ను ఆకాశానికి ఎత్తేయటంతో ఆగకుండా.. ఆయన ప్రత్యర్థులు చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ పైనా పంచ్ లు వేయటం షురూ చేశారు. దీంతో.. టీడీపీకి చెందిన మహిళా నేతలు సైతం యాంకర్ శ్యామలను టార్గెట్ చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారపార్టీకి వత్తాసుగా రావటం తప్పేం కాదని.. కాకుంటే వచ్చి.. మర్యాదగా ప్రచారం చేసి వెళితే ఎవరూ ఏమీ అనరని.. అందుకు భిన్నంగా వ్యక్తిగత విమర్శలు చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ మహిళా నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా టీడీపీ మహిళా నేత చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Read more!

పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం వెళ్లిన శ్యామల.. అక్కడ వంగా గీతకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఘాటు విమర్శలు చేయటానికి వెనుకాడలేదు. దీంతో తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. తెలుగుదేశం మహిళా నేత ఉండవల్లి అనూష ఒక అడుగు ముందుకేసి.. యాంకర్ శ్యామలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘నీ చీకటి బాగోతం బయటపెడతా’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. యాంకర్ శ్యామల గతంలో తెలంగాణలో షర్మిల పార్టీలో తిరిగారని.. ఆమె పార్టీ ఎత్తేసి ఏపీకి వచ్చిన తర్వాత కులపిచ్చితో ఆంధ్రాకు వచ్చి వైసీపీలో చేరారంటూ సీరియస్ ఆరోపణలు చేవారు. అసలు శ్యామలకు ఆంధ్రాలో ఏం పని? అని ప్రశ్నిస్తున్నారు. తాము నోరు విప్పితే చాలా నిజాల్ని మాట్లాడగలమన్న ఉండవల్లి అనూష.. ‘‘మాకు నోరుంది. మేం కూడా అనర్గళంగా మాట్లాడగలం. యాంకరింగ్.. సినిమా పంక్షన్స్ చేసుకునే నీకు రాజకీయాలు ఎందుకు? అవగాహన లేకుండా చంద్రబాబు.. పవన్ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. నీ భర్త చేసిన ఘోరాలు.. నీ చీకటి బాగోతం బయటపెడతాం. నీకులా కథలు కాదు నిజాలు చెబుతాం’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరి.. ఆమెకు శ్యామల ఎలాంటి కౌంటర్ ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News