అమరావతిలో మలేషియా పెట్టుబడులు? కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
ముఖ్యంగా మలేషియాలో తెలుగు మూలాలు ఉన్న పారిశ్రామిక వేత్తలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ ప్రాజెక్ట్ ల గురించి మంత్రి నారాయణకు వివరించారు.;
ఏపీ రాజధాని అమరావతికి పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకుతోపాటు హడ్కో, జర్మన్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రాజధాని నిర్మాణ పనులను పరుగులు తీయిస్తున్న ప్రభుత్వం తాజాగా మలేషియా పెట్టుబడులకు తలుపులు తెరచింది. ఈ నెల 1 నుంచి అమరావతిలో పర్యటిస్తున్న మలేషియా అధికారిక బృందం సచివాలయంలో మంత్రి నారాయణతో సమావేశమై రాజధానిలో రూ.6 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
ప్రపంచంలో ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు మంత్రి నారాయణ మలేషియా బృందం ద్రుష్టికి తీసుకువెళ్లారు. మలేషియా బృందంతో మంత్రి నారాయణ అమరావతి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ తర్వాత సచివాలయంలో వారితో భేటీ అయ్యారు. మలేషియాలోని సెలాంగార్ స్టేట్ ఎక్స్ కో మంత్రి పప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గనబతిరావ్, మలేషియా - ఆంధ్రా బిజినెస్ చాంబర్ ప్రతినిధులు, పలు ప్రయివేట్ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. అమరావతి అభివృద్దికి భారత్ తో కలిసి పనిచేస్తామని మలేషియా మంత్రి పప్పారాయుడు వెల్లడించారు.
ముఖ్యంగా మలేషియాలో తెలుగు మూలాలు ఉన్న పారిశ్రామిక వేత్తలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ ప్రాజెక్ట్ ల గురించి మంత్రి నారాయణకు వివరించారు. ఐదు కీలక సెక్టార్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు తమ ఆసక్తి వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్, టూరిజం - హాస్పిటాలిటీ, ట్రేడ్ అండ్ కామర్స్, రియల్ ఎస్టేట్ (టెక్నాలజీ ట్రాన్స్ ఫర్, అభివృద్ది, మౌళిక వసతులు కల్పన), తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన వివిధ ప్రాజెక్ట్ ల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. అమరావతిలో మెడికల్ యూనివర్శిటీ ఏర్పాటుకు మలేషియాలోని సైబర్ జయ యూనివర్శిటీ ముందుకొచ్చింది. అలాగే ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటుకు బెర్జయ (BERJAYA) గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది.
అమరావతి అభివృద్ది పనులను మంత్రి నారాయణ మలేషియా ప్రతినిధులకు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రణాళికాబద్దంగా అమరావతి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 51 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయని ఆ పనులు నిర్ధేశిత గడువులోగా పూర్తి చేస్తున్నామన్నారు. కేపిటల్ సిటీలో 360 కి.మీ. మేర ట్రంక్ రోడ్లు ఏడాదిన్నలోగా నిర్మిస్తామని స్పష్టం చేశారు. 1500 కి.మీ లే అవుట్ రోడ్లు రెండేళ్లలోగా పూర్తవుతాయని, వచ్చే మార్చి నాటికి అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల క్వార్టర్లు సుమారు 4000 పూర్తి కానున్నాయని తెలిపారు.
పాలనా భవనాలైన సచివాలయం టవర్లు, అసెంబ్లీతో పాటు హైకోర్టు భవనాలను రెండున్నరేళ్లలో పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నామన్నారు. గత మూడు నెలలుగా వర్షాల వల్ల పనులకు కొంతమేర ఆటంకం కలిగిందని, రాబోయే రోజుల్లో పనులు వేగవంతం అవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్రభుత్వ వివరణతో సంతృప్తి వ్యక్తం చేసిన మలేషియా ప్రతినిధులు తమ పెట్టుబడులకు సంబంధించి త్వరలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు.