తమిళనాట భారీ ట్విస్ట్.. అన్నాడీఎంకేపై బీజేపీ ముద్ర!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. మరో నాలుగు రోజుల్లో జరుగుతుందనగా.. భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకేపై బీజేపీ ముద్ర బలంగా పడింది.;
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. మరో నాలుగు రోజుల్లో జరుగుతుందనగా.. భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకేపై బీజేపీ ముద్ర బలంగా పడింది. అంతేకాదు.. తమిళనాడు భాష, సంప్రదాయాలపై గతంలో బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. ఇటు డీఎంకే.. అటు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు చేస్తున్న ప్రచారం కూడా.. దుమ్మురేపుతోంది. దీంతో ఇప్పటి వరకు అన్నాడీఎంకే బలమైన పోరాటం చేస్తుందన్న వాదనలు నెమ్మది నెమ్మదిగా వీగుతున్నాయి.
ఏం జరిగింది...?
బీజేపీతో సాధ్యమైనంత వరకు దూరం పాటించిన అన్నాడీఎంకే.. గత ఎన్నికల నాటి నుంచి ఆ పార్టీతో చెలిమి చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి అన్నాడీఎంకే అధ్యక్షురాలు, దివంగత జయలలితను జైలుకు పంపించిన పార్టీగా.. బీజేపీని ఒకప్పుడు ఈ పార్టీనే ప్రచారం చేసుకుంది. కానీ, తర్వాత.. అన్నాడీఎంకే ప్రభుత్వం తరఫున సీఎంగా వ్యవహరించిన పళని స్వామి సహా.. పలువురు నాయకులు కేంద్రం చేతిలోకి వెళ్లిపోయారన్న వాదన ఉంది. ఈ క్రమంలోనే 2021లోనే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. అయితే.. అది విఫలమైంది. కానీ.. ఇప్పుడు కూడా.. అదే ఫార్ములాను కొనసాగిస్తున్నారు.
ఈ పరిణామాలే ఇప్పుడు కాంగ్రెస్+డీఎంకే కూటమికి కలిసి వచ్చింది. అన్నాడీఎంకే పై బీజేపీ ముద్ర పడిందని.. అన్నాడీఎంకేను అడ్డు పెట్టుకుని బీజేపీ.. తమిళనాడను తన కబంద హస్తాల్లోని తీసుకునేందుకు బీజేపీ సహా.. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ప్రయత్నిస్తున్నారని ప్రచారంలో దుమ్మురేపుతున్నారు. మరోవైపు.. సోషల్ మీడియాలోనూ అన్నాడీఎం కేపై ఇదే తరహా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. గతంలో ప్రధాని మోడీపై మాజీ సీఎం జయలలిత చేసిన వ్యాఖ్యలను కూడా ప్రచారంలో పెట్టారు. అలాంటి బీజేపీతో ఇప్పుడు అన్నాడీఎంకే చెలిమి చేస్తోందని చెబుతున్నారు. ఈ ప్రచారం జోరుగా ప్రజల మధ్యకు వెళ్తోంది.
పళని సభలో నిరసన..
తాజాగా శనివారం.. అన్నాడీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. పళని స్వామి.. నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నిరసన వ్యక్తమైంది. ముఖ్యంగా ఆపార్టీకి చెందిన నాయకులే.. బీజేపీ ముద్ర పడిందని.. ఇంతగా అంటకాగాల్సిన అవసరం ఏంటని పళనిని ప్రశ్నించారు. నిజానికి అన్నాడీఎంకేలో చాలా మంది నాయకులు ఈ పొత్తును విభేదిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం.. పన్నీర్ సెల్వం వంటివారు .. ఈ పొత్తును విభేదించి.. డీఎంకేతో జట్టు కట్టారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన పరిణామం పళని స్వామిని అంతర్మథనంలో పడేసింది. ఈ ప్రభావం.. అన్నాడీఎంకేకు గట్టి పట్టున్న నియోజకవర్గాల్లోనూ కనిపిస్తోంది. వాస్తవానికి ఈ దఫా అన్నాడీఎంకే అధికారం దక్కించుకోకపోతే.. అసలు పార్టీ ఉంటుందా? ఉండదా? అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.