పిల్లల కోసమే ఎందుకు విరుష్క జంట భయపడుతున్నారు?
భారత్లో సెలబ్రిటీల పిల్లలు పెరగడం తీవ్రమైన సవాళ్లతో కూడుకున్న వ్యవహారంగా మారింది.
భారతీయ సినీ, క్రీడా రంగాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ (విరుష్క) భారతదేశాన్ని వదిలి లండన్లో నివాసం ఉండటానికి గల ప్రధాన కారణాన్ని ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ భర్త, డాక్టర్ శ్రీరామ్ నేనే ఇటీవల వెల్లడించారు. ఒక ప్రముఖ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఈ స్టార్ జోడీ తమ పిల్లలైన వామిక, అకాయ్ల భవిష్యత్తు -ప్రైవసీ విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారని స్పష్టం చేశారు. భారత్లో లభించే విపరీతమైన పబ్లిసిటీ..కెమెరాల నిరంతర నిఘా వల్ల తమ పిల్లలు సాధారణ బాల్యాన్ని కోల్పోతారనే భయమే వారిని దేశం దాటేలా చేసిందని వివరించారు.
భారత్లో సెలబ్రిటీల పిల్లలు పెరగడం తీవ్రమైన సవాళ్లతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఫోటోగ్రాఫర్లు మీడియా, సోషల్ మీడియా ట్రాకర్లు నిరంతరం అనుసరిస్తూ ఉండటం వల్ల పిల్లలకు స్కూలు వాతావరణంలో కానీ.. బయట ఆడుకునే సమయంలో కానీ సాధారణ స్వేచ్ఛ దొరకదు. తాము స్టార్ సెలబ్రిటీల పిల్లలమనే భావన చిన్నతనంలోనే వారిపై పడటం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. తోటి పిల్లలతో సాధారణంగా కలవలేకపోవడం.. ఎటు వెళ్లినా కెమెరా లెన్సులు వెంటాడటం వారి సహజమైన వ్యక్తిత్వ వికాసానికి పెద్ద అవరోధంగా మారుతుందని విరుష్క జంట భావిస్తోంది.
ఈ విధమైన పబ్లిక్ స్పాట్లైట్ - భయాన్ని ఎదుర్కొని ముందుకు సాగడం ఏ పేరెంట్ కి అయినా శ్రమతో కూడుకున్న పని. పిల్లలకు సెలబ్రిటీ ఇమేజ్ సోకకుండా సరిహద్దులు గీయడం... సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం... ఫోటోగ్రాఫర్లకు ముందే విజ్ఞప్తి చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఎంత కట్టుదిట్టం చేసినా భారతీయ వాతావరణంలో అనుక్షణం స్టిల్ కెమెరాల కంట పడకుండా ఉండటం అసాధ్యం. అందుకే నిరంతర నిఘా నుంచి దూరంగా ఉంటూ తమ పిల్లలు మిగతా అందరి పిల్లలలాగే వీధుల్లో స్వేచ్ఛగా ఆడుకునేలా.. ఎలాంటి ఒత్తిళ్లు లేని వాతావరణంలో పెరిగేలా లండన్ లైఫ్స్టైల్ను వారు ఎంచుకున్నారు.
డాక్టర్ శ్రీరామ్ నేనే సైతం సెలబ్రిటీ కల్చర్ వల్ల వచ్చే ఐసోలేషన్ (ఏకాకితనం) గురించి విశ్లేషించారు. అత్యధిక ప్రజాదరణ ఉన్న వ్యక్తులు ఏ పని చేసినా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని... ఫలితంగా సాధారణ జీవితానికి దూరం కావలసి వస్తుందని చెప్పారు. విరాట్-అనుష్క దంపతులు తమ పిల్లలకు అటువంటి పరిమితులు లేని సాధారణ జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పాశ్చాత్య దేశాల్లో లభించే అజ్ఞాత జీవితం వల్ల పిల్లలు ఎవరి ప్రాధాన్యతా లేకుండా... స్టార్డమ్ భారాలు మోయకుండా పెరిగే వెసులుబాటు లభిస్తుంది.
మొత్తానికి విరుష్క జంట తీసుకున్న ఈ నిర్ణయం కేవలం విలాసవంతమైన జీవనశైలి కోసం కాదు.. ఒక తల్లిదండ్రిగా తమ పిల్లల భద్రత- మానసిక ప్రశాంతత- స్వేచ్ఛాయుతమైన బాల్యం కోసం పడిన తపనకు నిదర్శనం. సెలబ్రిటీల ప్రైవసీని గౌరవించడం.. వారి పిల్లలను సాధారణ వ్యక్తులుగా చూడటం ఎంత అవసరమో ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. విదేశాల్లో లభించే ఈ స్వేచ్ఛ తమ పిల్లలకు సరైన వ్యక్తిత్వ రూపురేఖలను ఇస్తుందనే నమ్మకంతోనే విరాట్-అనుష్క లండన్లో ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆసక్తికరంగా లండన్ లోని ఇస్కాన్ దేవాలయాన్ని రెగ్యులర్ గా సందర్భించే ఈ జంట ఇస్కాన్ ఆచారాలను పాటిస్తున్న సంగతి తెలిసిందే.