రావ‌ణ లంక‌పై 50,000 వాన‌రాల దాడి! కుంభ‌క‌ర్ణుడితో యుద్ధం..'వార‌ణాసి' బిగ్గెస్ట్ యాక్ష‌న్ బ్లాస్ట్!

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి` భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులకు తెరలేపుతోంది.

Update: 2026-06-30 04:01 GMT

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి` భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులకు తెరలేపుతోంది. బ‌డ్జెట్ ప‌రంగా, గ్రాండియారిటీ ప‌రంగా ఈ చిత్రం స‌రికొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇటీవల ప్యారిస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రాజమౌళి జూలై 7 నుంచి నగరంలో ఒక మైండ్ బ్లోయింగ్ యాక్షన్ షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై ఇంతవరకు ఎవరూ ఊహించని విధంగా... రావణ లంకపై జరిగే మహా యుద్ధ ఘట్టాన్ని ఈ షెడ్యూల్‌లో భారీ ఎత్తున చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేశారు.

`వారణాసి` చిత్రంలోనే బిగ్గెస్ట్ యాక్షన్ బ్లాస్ట్‌గా నిలిచే లంక‌పై `వానరాల దాడి సీన్` కోసం రాజమౌళి ఏకంగా 3,600 మంది జూనియర్ ఆర్టిస్టులను బరిలోకి దించుతున్నారు. హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో ఈ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. కేవలం నటీనటులతోనే కాకుండా.. భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX)ను జోడించి ఈ ఎపిసోడ్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దనున్నారు. సెట్స్‌లో పాల్గొనే ఆ 3,600 మంది ఆర్టిస్టులను డిజిటల్ స్క్రీన్‌పై మల్టిప్లై చేస్తూ... ఒకేసారి ఏకంగా 50,000 మంది వానరులు లంకపై దాడి చేసే విజువల్ వండర్‌ను థియేటర్లలో ఆవిష్కరించనున్నారు.

ఈ అద్భుతమైన ఎపిసోడ్‌లోనే కథా పరంగా అత్యంత కీలకమైన `కుంభకర్ణుడితో యుద్ధం` జరగనుంది. వానర సైన్యానికి - కుంభకర్ణుడికి మధ్య సాగే ఈ పోరాటం థియేటర్లలో ప్రేక్షకులకు రోమాంచితమైన అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 20 నిమిషాల పాటు సాగే ఈ రామాయణ యుద్ధ ఘట్టం కోసం చిత్రబృందం ఏకంగా రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

ఇటీవలే ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విజువల్స్ -క్లిప్స్‌ను యూరోపియన్ ప్రేక్షకులకు రాజమౌళి ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఆ ప్రదర్శనలోనే ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ప్రేక్షకులు అంటార్కిటికా మంచు ఖండాలు, ఊహకందని ప్రకృతి వైపరీత్యాలతో పాటు `రామాయణం`ఆధారిత మైథలాజికల్ ఎపిసోడ్స్, దేవుళ్ళను చూడబోతున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన మేజర్ ఐమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పుడు హైద‌రాబాద్ లో సరికొత్త షెడ్యూల్‌తో టాప్-నాచ్ యాక్షన్ సీక్వెన్స్ సిద్ధం కానుంది.

ఈ భారీ గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ చిత్రంలో మహేష్ బాబు `రుద్ర` అనే శక్తివంతమైన పాత్రలో విభిన్న టైమ్‌లైన్స్‌లో ప్రయాణించే సాహ‌సికుడిగా కనిపిస్తుండగా, `కుంభ` అనే పవర్‌ఫుల్ పాత్రలో వెర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ప్రియాంకా చోప్రా జోనాస్ `మందాకిని`గా కీలక పాత్ర పోషిస్తోంది. అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్తున్న ఈ హాలీవుడ్ రేంజ్ విజువల్ వండర్ 7 ఏప్రిల్ 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుద‌ల కానుంది.

గతంలో `బాహుబలి`లో మహిష్మతి యుద్ధం, `RRR`లో క్లైమాక్స్ ఫైట్‌తో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసిన రాజమౌళి.. ఇప్పుడు `వారణాసి`లో కేవలం ఒకే ఒక్క 20 నిమిషాల వానర యుద్ధ ఘట్టం కోసం రూ. 200 కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ.. 50,000 డిజిటల్ వానర సైన్యాన్ని రంగంలోకి దించుతున్నార‌నే ప్ర‌చారం అభిమానుల్లో అంత‌కంత‌కు ఉత్కంఠ‌ను పెంచుతోంది. అయితే ఈ బడ్జెట్ లెక్క‌లు వ‌గైరా చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News