షారుఖ్ మైత్రీకి క్లారిటీ ఇచ్చేదప్పుడే!
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కింగ్ సినిమాపైనే పెట్టాడు.;

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కింగ్ సినిమాపైనే పెట్టాడు. రెడ్ చిల్లీస్ బ్యానర్ లో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, అనిల్ కపూర్, సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, అర్షద్ వార్సీ, జైదీప్, అభయ్ వర్మ లాంటి స్టార్ క్యాస్టింగ్ నటిస్తుండటంతో కింగ్ సినిమాపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా కోసం అందులోని నటులందరూ తమ యాక్షన్ ను నెక్ట్స్ లెవెల్ లో ప్రెజెంట్ చేయడానికి మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కింగ్ మూవీలో షారుఖ్ లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్ ను పోషిస్తుండటంతో సినిమా షూటింగ్ అనుకున్న దాని కంటే కాస్త ఆలస్యమై నెక్ట్స్ ఇయర్ ఫస్టాఫ్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ ఓ బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ తో ఓ సినిమా చేయడానికి కమిట్ అవుతున్నాడని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. ఆ నిర్మాణ సంస్థ మరేదో కాదు, పుష్ప లాంటి సూపర్ హిట్ ఫ్రాంచైజ్ ను అందించిన మైత్రీ మూవీ మేకర్స్. మైత్రీ బ్యానర్ లో సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి షారుఖ్ 2025 చివరి నాటికి అగ్రిమెంట్ కుదుర్చుకోనున్నాడని మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.
దీని గురించి మీడియా ఛానెల్స్ లో, సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలైతే వస్తున్నాయి కానీ షారుఖ్ టీమ్ కానీ మైత్రీ టీమ్ కానీ ఈ విషయంపై ఎక్కడా బయటపడి మాట్లాడింది లేదు. ప్రస్తుతం షారుఖ్ దృష్టంతా కింగ్ సినిమా పైనే ఉన్నట్టు తెలుస్తోంది. షారుఖ్ మైత్రీతో సినిమా చేసేదీ లేనిదీ 2025 ఎండింగ్ నాటికి కానీ క్లారిటీ రాదు. ఒకవేళ కింగ్ తర్వాత షారుఖ్ మైత్రీ తో సినిమాను లాక్ చేసుకుని సుకుమార్ దర్శకత్వంలో మూవీ చేస్తే అతని ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు. ఏదేమైనా కింగ్ సినిమా పూర్తయ్యే వరకు షారుఖ్ మరో సినిమాను ఒప్పుకునేలా కనిపించడం లేదు.