IPL టీమ్ని కొనడానికి షారుఖ్ వెనుకడుగు.. ఒక్కో సీజన్కి 250కోట్లు దండుకుంటున్నాడు!
ఈరోజు ఐపిఎల్ ట్రోఫీ విజేత కానవసరం లేదు. టోర్నీలో ఆడితే చాలు.. ఆ జట్టు యజమాని వందల కోట్ల లాభాల్ని దండుకుంటున్నారు.
ఈరోజు ఐపిఎల్ ట్రోఫీ విజేత కానవసరం లేదు. టోర్నీలో ఆడితే చాలు.. ఆ జట్టు యజమాని వందల కోట్ల లాభాల్ని దండుకుంటున్నారు. పెట్టిన పెట్టుబడిపై రెండు రెట్లు ఆదాయం వస్తోంది. వాణిజ్య ప్రకటనలు సహా రకరకాల రైట్స్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు టీమ్ యజమాని ఖాతాలోకి వచ్చి పడుతోంది. పెట్టుబడులు పెట్టేవారికి ఐపిఎల్ టీమ్ ని కొనడం అంత సురక్షితమైన పెట్టుబడి మరొకటి లేదనే టాక్ ఉంది.
కింగ్ ఖాన్ షారూఖ్ ప్రమోట్ చేస్తున్న కేకేఆర్ జట్టు కారణంగా అతడు వందల కోట్ల లాభాల్ని దండుకుంటున్నారు. అయితే ప్రారంభంలో అసలు క్రికెట్ టీమ్ లపై పెట్టుబడులు పెట్టేందుకు షారూఖ్ వెనక్కి జంకారట. ఈ విషయాన్ని మీజీ ఐపిఎల్ ఛైర్మన్ లలిత్ మోదీ ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) ఫ్రాంచైజీకి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. కేకేఆర్ జట్టును లీగ్లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ - వాల్యూబుల్ బ్రాండ్లలో ఒకటిగా నిలబెట్టడంలో షారుఖ్ చేసిన కృషి సామాన్యమైనది కాదు. అయితే 2008లో ఐపీఎల్ ప్రారంభ సమయంలో కోల్కతా జట్టును కొనుగోలు చేయడానికి షారుఖ్ ఖాన్ తొలుత తీవ్రంగా సంకోచించారని.. వెనుకడుగు వేశారని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. నాటి అంతర్గత విషయం ఇప్పుడు క్రికెట్, సినిమా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
లలిత్ మోదీ వివరాల ప్రకారం.. ఐపీఎల్ మొదటి సీజన్ కోసం ఫ్రాంచైజీల వేలం నిర్వహించకముందు ఆయన స్వయంగా షారుఖ్ ఖాన్ను సంప్రదించారు. క్రికెట్ లీగ్లో బాలీవుడ్ గ్లామర్ జోడైతే టోర్నమెంట్కు విపరీతమైన క్రేజ్ వస్తుందని మోదీ భావించారు. అయితే ఆ సమయంలో షారుఖ్ ఈ ప్రతిపాదనపై పెద్దగా ఆసక్తి చూపలేదు సరేకదా.. అసలు ఈ కొత్త లీగ్ మోడల్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనే అనుమానాలను వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడిగా పెట్టాల్సి రావడం, క్రికెట్ వ్యాపార రంగంలో తనకు గతానుభవం లేకపోవడంతో ఆయన ఈ డీల్ లో ముందడుగు వేయడానికి వెనుకాడారు.
కానీ లలిత్ మోదీ పట్టువదలకుండా షారుఖ్ ఖాన్కు ఐపీఎల్ భవిష్యత్తు ప్రణాళికలను, దీని ద్వారా వచ్చే దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను సుదీర్ఘంగా వివరించి ఒప్పించారు. లీగ్ బిజినెస్ మోడల్ -గ్లోబల్ రీచ్ గురించి మోదీ ఇచ్చిన భరోసాతో షారుఖ్ చివరకు సంతృప్తి చెందారు. ఆ తర్వాతే ఆయన జుహీ చావ్లా, జై మెహతాలతో కలిసి `రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్` ద్వారా కోల్కతా ఫ్రాంచైజీని సొంతం చేసుకోవడానికి వేలంలో పాల్గొన్నారు. అలా 75.09 మిలియన్ డాలర్ల భారీ మొత్తానికి కోల్కతా నైట్ రైడర్స్ జట్టును వారు దక్కించుకున్నారు.
నాడు వెనుకడుగు వేసిన షారుఖ్ ఖాన్.. నేడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ఐపీఎల్లోనే అత్యంత క్రేజ్ ఉన్న ఫ్రాంచైజీగా మార్చేశారు. ఈ జట్టు ఇప్పటికే మూడు సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా (2012, 2014, 2024) నిలిచి లీగ్లోనే తిరుగులేని శక్తులలో ఒకటిగా అవతరించింది. కేవలం మైదానంలోనే కాకుండా, బిజినెస్ మార్కెట్లోనూ కేకేఆర్ బ్రాండ్ వాల్యూ వందల కోట్లకు చేరుకుంది. ప్రారంభంలో లలిత్ మోదీ చేసిన ఆ ఒక్క సుదీర్ఘ చర్చ చూపిన చొరవే నేడు షారుఖ్ ఖాన్ను క్రికెట్ సామ్రాజ్యంలోనూ ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలబెట్టేలా చేసిందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. 2026 ఐపిఎల్ కోసం వేలంలో ఆటగాళ్లను కొనేందుకు సుమారుగా 125 కోట్లు ఖర్చు చేస్తే వచ్చిన లాభం దానికి రెట్టింపు ఉందన్న టాక్ వినిపించింది. ప్రతి సంవత్సరం కేకేఆర్ టీమ్ కి సుమారు 250 కోట్ల నుంచి 270 కోట్ల వరకూ ఆదాయం గిట్టుబాటు అవుతోందట.