మహేష్ మనసు దోచిన సినిమా
మోహిత్ సూరి దర్శకత్వం వహించిన రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా `సైయారా` ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ల జాబితాలో చేరబోతోంది.;
మోహిత్ సూరి దర్శకత్వం వహించిన రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా `సైయారా` ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ల జాబితాలో చేరబోతోంది. బాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్ని మించి ఈ సినిమా ఓపెనింగులు సాధించడం ఆశ్చర్యపరిచింది. అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, సైఫ్ ఖాన్ వంటి స్టార్ల కుటుంబాల నుంచి వచ్చిన నటవారసులు అందుకోని గొప్ప విజయాన్ని డెబ్యూ హీరో అహాన్ పాండే అందుకున్నాడు. ఈ సినిమాతో తొలి పరిచయం అయిన అహాన్- అనీత్ పద్దుల నటనకు విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి.
తాజాగా ఈ సినిమాని సూపర్స్టార్ మహేష్ బాబు వీక్షించి సోషల్ మీడియాలో తన అద్భుతమైన సమీక్షను షేర్ చేసారు. ``ఒక విజన్ తో సైయారా టీం నిజాయితీతో కూడుకున్న కథను చెప్పారు.. అద్భుత నట ప్రదర్శనలతో ఎంత అందంగా నిర్మించారో.. అహాన్ పాండే & అనీత్ పద్దా తమ పాత్రలలో చాలా సులభంగా జీవించినందుకు వారికి హృదయపూర్వక ప్రేమ.. ఇది ప్రేమకు అర్హమైన చిత్రం`` అని ప్రశంసలు కురిపించారు.
సైయారా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే రూ.22 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకూ భారతదేశంలో ఇది తొలి పరిచయ నటీనటులకు బెస్ట్ ఓపెనింగ్. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా, మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. మోహిత్ రచన, దర్శకత్వ ప్రతిభపై ప్రశంసలు కురుస్తున్నాయి. చిత్ర కథనాయకుడు అహాన్ పాండే - అందాల కథానాయిక అనన్య పాండే కజిన్ అలనా పాండేకు సోదరుడు. అలనా పాండే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా సుపరిచితురాలు.