వెలుగుతున్న అగ్గిపుల్ల వెన‌క మిస్ట‌రీ ఏంటో తేజ్?

సాయి దుర్గ తేజ్ షేర్ చేసిన ఆ ఫోటో వెనుక ఒక లోతైన సందేశం ఉంది. లైట్ యువ‌ర్ వే అంటే `నీ దారిని నువ్వే వెలిగించుకో` అని అర్థం.;

Update: 2026-02-14 04:00 GMT

విరూపాక్ష లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత సాయి దుర్గ తేజ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం `సంబరాల ఏటిగట్టు`. ఈ సినిమా పోస్ట‌ర్, టీజ‌ర్ ద‌శ నుంచే ప్రేక్ష‌కుల‌లో ఎంతో ఆస‌క్తిని పెంచింది. దానికి తోడు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజులో మొత్తం ఐదు భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నామ‌ని టీజ‌ర్ లో కూడా ప్ర‌క‌టించ‌డంతో ఒక‌టే క్యూరియాసిటీ పెరిగింది. మెగా మేన‌ల్లుడు సాయి తేజ్ బాడీ లాంగ్వేజ్ కి త‌గ్గ‌ట్టే భారీ యాక్ష‌న్ కంటెంట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు భావిస్తున్నారు.

అయితే రిలీజ్ అనూహ్యంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. భారీ సీజీ వ‌ర్క్ స‌హా టెక్నిక‌ల్ గా హై స్టాండార్డ్స్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని దానికోసం ఇంకా కొంత స‌మ‌యం కావాల‌ని నిర్మాత‌లు తెలిపారు. అయితే సంబ‌రాల ఏటి గ‌ట్టు హైప్ త‌గ్గ‌కుండా చిత్ర క‌థానాయ‌కుడు సాయి తేజ్ ఎంతో ఉత్సాహంగా పోస్ట‌ర్లు షేర్ చేస్తూ ప్ర‌మోట్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.

తాజాగా జెట్ పంజా ఇన్ స్టా పేజీలో సాయి తేజ్ ఒక నిగూఢ‌మైన పోస్ట‌ర్ ని షేర్ చేసాడు. ఇది చూడ‌గానే అభిమానుల్లో ర‌క‌ర‌కాల సందేహాలు.. ఇలా వెలుగుతున్న అగ్గి పుల్ల వెన‌క అంత‌రార్థం ఏమిటో సాయిధ‌ర‌మ్ చెప్ప‌లేదు...! అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అత‌డు నటిస్తున్న సంబ‌రాల ఏటి గ‌ట్టు అస‌లు క‌థేమిటో తెలిస్తే దీనికి మ‌రింత స్ప‌ష్ఠ‌త వ‌స్తుంది.

అగ్గిపుల్ల వెనుక అంతరార్థం

సాయి దుర్గ తేజ్ షేర్ చేసిన ఆ ఫోటో వెనుక ఒక లోతైన సందేశం ఉంది. లైట్ యువ‌ర్ వే అంటే `నీ దారిని నువ్వే వెలిగించుకో` అని అర్థం. ఇది సినిమాలో సాయితేజ్ పోషిస్తున్న‌ పాత్ర స్వభావం. చీకటిని చీల్చుకుంటూ వెలుగు వైపు సాగే ప్రయాణం లేదా ఒక సామాజిక మార్పు కోసం పోరాడే వ్యక్తిగా ఈ చిత్రంలో సాయి తేజ్ కనిపిస్తారని ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది. ఇది కేవ‌లం ఫోటో లేదా పోస్ట‌ర్ మాత్ర‌మే అనుకోవ‌డానికి లేదు. సినిమా థీమ్‌కు సంబంధించిన ఒక `ప్రోమో` లాంటిది.

సంబరాల ఏటిగట్టు అసలు కథేమిటి?

ఈ సినిమా 1990ల కాలంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఇది ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలోని ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. గ్రామీణ సంస్కృతి, ఆ ఊరిలో జరిగే సంబరాలు (జాతరలు), ఏటిగట్టు చుట్టూ ఉన్న సామాజిక సమస్యల చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. సాయి దుర్గ తేజ్ ఇందులో చాలా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఒక సామాన్యుడు వ్యవస్థపై చేసే పోరాటం ఇందులో కీలకం అని తెలుస్తోంది.

సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది?

ఈ సినిమా 2025 ద్వితీయార్ధంలో విడుద‌ల కావాల్సి ఉన్నా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. ముఖ్యంగా కంప్యూట‌ర్ గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ ప‌రంగా నాణ్య‌త కోసం చిత్ర‌బృందం ప్ర‌య‌త్నిస్తోంది. ఈ వేస‌విలోనే సినిమా విడుద‌ల కానుంది. పెండింగ్ ప‌నుల్ని ముగించినా.. గ్రాఫిక్స్ పనుల కారణంగా కచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదని కూడా తెలుస్తోంది.

పేరు మార్చుకుంటే క‌లిసొస్తుందా?

సాయి ధరమ్ తేజ్ తన పేరును సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్న తర్వాత చేస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం ఇది. ఈ సినిమా కోసం అత‌డు ఫిజికల్‌గా చాలా కష్టపడ్డారు. స్క్రిప్ట్‌లో చిన్న చిన్న మార్పుల వల్ల ప్రీ-ప్రొడక్షన్ సమయం పెరిగింది. హనుమాన్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ అందించిన ప్ర‌ముఖ‌ నిర్మాత నిరంజన్ రెడ్డి (ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్) ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. రోహిత్ కేపి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవ‌తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ (కాంతార ఫేమ్) సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం 90ల నాటి వాతావరణాన్ని రీ క్రియేట్ చేయడానికి సెట్స్ ను భారీగా నిర్మించారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని చిత్ర బృందం భావిస్తోంది.

Tags:    

Similar News