రాజ‌మౌళి కండీష‌న్ ఆ హీరోకి లేదా?

కానీ తాజాగా తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం 'వారణాసి' విషయంలో మాత్రం ఒక స్టార్ హీరో ఈ అన్-రిటన్ రూల్‌ను తిరగరాశారు.

Update: 2026-09-15 23:30 GMT

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో అవకాశం వచ్చిందంటే నటీనటులు త‌మ క్యాలెండర్‌ను పూర్తిగా ఖాళీ చేసుకోవాల్సిందే. జక్కన్న ప్రాజెక్ట్‌లలో నటించే నటీనటులపై కఠినమైన నిబంధనలు విధిస్తారనేది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. సినిమా పూర్తయ్యే వరకు వేరే ఏ ఇతర చిత్రాల్లోనూ నటించకూడదని, లుక్ మారకూడదని ఆయన గట్టిగా షరతు పెడతారు. కానీ తాజాగా తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం `వారణాసి` విషయంలో మాత్రం ఒక స్టార్ హీరో ఈ అన్-రిటన్ రూల్‌ను తిరగరాశారు.

మలయాళ సినీ సీమలోని బహుముఖ ప్రజ్ఞాశాలి, స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ `వారణాసి` చిత్రంలో `కుంభ` అనే అత్యంత శక్తివంతమైన ప్రతి నాయకుడి (విలన్) పాత్రలో నటిస్తున్నారు. సాధారణంగా రాజమౌళి బ్లూప్రింట్‌లో ఒకసారి భాగమైతే నటులు సంవత్సరాల తరబడి ఆ ఒక్క ప్రాజెక్ట్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. అయితే పృథ్వీ రాజ్ మాత్రం జక్కన్న మేకింగ్ శైలికి పూర్తి భిన్నంగా తన వర్కింగ్ స్పీడ్‌ను చూపిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు.

`వారణాసి` ప్రాజెక్ట్ ప్రి-ప్రొడక్షన్ పనులు, వర్క్‌షాప్‌లు , షూటింగ్ షెడ్యూళ్ల మధ్య వచ్చిన గ్యాప్‌ను పృథ్వీరాజ్ సుకుమారన్ సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. ఈ గ్యాప్‌లోనే ఆయన ఏకంగా 9 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి అద్భుతమైన ప్లానింగ్ ..వర్కింగ్ స్పీడ్‌ను నిరూపించుకున్నారు. మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ నటుడిగా, దర్శకుడిగా, నిర్మతగా వరుస సినిమాలను పూర్తి చేస్తూ పృథ్వీ చూపించిన వేగం ఇండస్ట్రీ వర్గాలను సైతం విస్తుపోయేలా చేసింది.

సాధారణంగా రాజమౌళి ప్రతి నటుడి నుంచి శారీరక, మానసిక మార్పులను కోరుకుంటారు. ముఖ్యంగా భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నప్పుడు లుక్ , హెయిర్‌స్టైల్ మారకుండా ఉండటం ఎంతో ముఖ్యం. అయితే పృథ్వీరాజ్ కుంభ పాత్రకు సంబంధించిన లుక్‌ను దెబ్బతినకుండా కాపాడుకుంటూనే కాల్షీట్లను ఇతర సినిమాలకు వేగంగా సర్దుబాటు చేసుకున్నారు. ఇది పృథ్వీ వృత్తిపరమైన క్రమశిక్షణకు అద్దం పడుతోంది.

ఒకవైపు రాజమౌళి సృష్టించే `వారణాసి` విశ్వంలో `కుంభ`గా భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటూనే.. మరోవైపు మిగతా సినిమాల్లో విభిన్న పాత్రలను పోషించడం పృథ్వీరాజ్‌కు మాత్రమే చెల్లింది. తన వద్ద పని చేసే నటులు ఏకాగ్రత కోల్పోకూడదని భావించే రాజమౌళి కూడా పృథ్వీరాజ్ మల్టీటాస్కింగ్ నైపుణ్యాన్ని, సమయ పాలనను చూసి ఎలాంటి అభ్యంతరం చెప్పలేకపోయారని తెలుస్తోంది.

ఈ ర‌క‌మైక ప‌ని విధానం మాలీవుడ్ న‌టుల‌కు బాగా అల‌వాటైందే. మోహ‌న్ లాల్ ఏడాదికి ఆరేడు సినిమాలు త‌ప్ప‌క రిలీజ్ చేస్తుంటారు. మ్ముట్టి కూడా అంతే వేగంగా సినిమాలు చేస్తుంటారు. అందుకోసం అవ‌స‌రం మేర న‌టీన‌టులు మూడు షిప్టులు ప‌నిచేస్తుంటారు. పృథ్వీరాజ్ కూడా ఇదే విధానంలో ప‌నిచేయ‌డం తొలి నుంచే అల‌వాటే.

Tags:    

Similar News