'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్' ఫ్లాప్..హరీష్‌కు అడ్వాన్స్ ఇచ్చారా?

దీంతో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌పై విమ‌ర్శ‌లొచ్చాయి. స్టార్ డైరెక్ట‌ర్ అయి ఉండి ఇలాంటి పేల‌వ‌మైన క‌థ‌తో సినిమా ఎలా చేశాడ‌ని అంతా విమర్శించారు.;

Update: 2026-03-14 14:30 GMT

సినిమా ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ మాత్ర‌మే మాట్లాడుతుంది. ఆ స‌క్సెస్ లేక‌పోతే ఇక్క‌డ ఎవ‌రికీ గౌర‌వం ఉండ‌దు. అంత వ‌ర‌కు బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చినా ఒక్క డిజాస్ట‌ర్ ఎదురైతే ప‌ల‌క‌రించే వారే ఉండ‌రు అన్న‌ది ఇండ‌స్ట్రీ గురించి తెలిసిన వాళ్లకు ప‌రిచ‌య‌మే. అలాంటి సంద‌ర్భాల్లో చాలా త‌క్కువ మంది మాత్ర‌మే ఫెయిల్యూర్స్‌లో ఉన్నా వారికి అండ‌గా నిలుస్తుంటారు. మాన‌సికంగా ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తుంటారు. అలాంటి ఓ సంఘ‌ట‌నే స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ విష‌యంలో చోటు చేసుకుంది.

బాలీవుడ్‌లో అజ‌య్ దేవ‌గ‌న్ హీరోగా న‌టించ‌గా సూప‌ర్ హిట్ అయిన `రైడ్` ఆధారంగా తెలుగులో డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ రీమేక్ చేసిన మూవీ `మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌`. మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా బోల్తాప‌డింది. స‌తీష్ వేగేశ్న తో పాటు మ‌రో న‌లుగురు స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చినా ఈ సినిమాని కాపాడ‌లేక‌పోయారు. రూ.70 కోట్ల బ‌డ్జెట్‌తో తీస్తే అందులో ఒక‌ట‌వ వంతు కూడా తిరిగి రాబ‌ట్ట‌లేక‌పోయింది.

దీంతో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌పై విమ‌ర్శ‌లొచ్చాయి. స్టార్ డైరెక్ట‌ర్ అయి ఉండి ఇలాంటి పేల‌వ‌మైన క‌థ‌తో సినిమా ఎలా చేశాడ‌ని అంతా విమర్శించారు. అయితే ఆ టైమ్‌లోనే హ‌రీష్ శంక‌ర్‌కు నిర్మాత‌ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ అడ్వాన్స్ పంపించార‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా ఓ పోడ్ కాస్ట్‌లో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ వెల్ల‌డించారు. `మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ పోయిన త‌రువాత ఇండ‌స్ట్రీలో ఎలా ఉంటుందో, ఫెయిల్యూర్ వ‌చ్చిన వాళ్ల‌ని ఎలా ట్రీట్ చేస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

అయితే మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ పోయిన త‌రువాత నాకు అడ్వాన్స్ పంపిన వ్య‌క్తి సితార వంశీగారు. స‌ర్ నాకు వేరే ప్రాజెక్ట్‌కు సంబంధించిన అడ్వాన్స్ ఉంది అని చెప్పాను. దానికి ఆయ‌న `ఒక్క ఫ్లాప్‌తో మిమ్మ‌ల్ని మేం జ‌డ్జ్ చేయ‌ట్లేదండి. మీరు ఎప్పుడైనా చేయండి. ప్లీజ్ కొలాబ‌రేట్ `అని చెప్పి వంశీగారు సినిమా ఫ్లాప్ అయ్యాక డ‌బ్బులు పంపారు. ఈ టైమ్‌లో మీకు డ‌బ్బులు అవ‌సం ఉంటాయి ఉంచండి` అన్నారు. ఆయ‌న‌తో నాకు మంచి అనుబంధం ఏర్ప‌డింది అని తెలిపారు. ఆ రోజు నాగ‌వంశీ ఇచ్చిన‌ అడ్వాన్స్ ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేయ‌డానికేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా హ‌రీష్ శంక‌ర్ ఓ భారీ యాక్ష‌న్ డ్రామాకు శ్రీ‌కారం చుట్టబోతున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌ని సితార ఎంట‌ర్ టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంది.

Tags:    

Similar News