మహేష్బాబుతో బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ భేటీ వెనక
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ -టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుల కలయిక ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.;
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ -టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుల కలయిక ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మహేష్ బాబును అలీ అబ్బాస్ జాఫర్ ఎందుకు కలిశారు? అంటూ ఒకటే ఆరాలు మొదలయ్యాయి.
ఇటీవల అలీ అబ్బాస్ జాఫర్ తన ఎక్స్ ఖాతాలో మహేష్ బాబుతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. అయితే ఇది ఏదైనా సినిమా కోసం జరిగిన భేటీ అని చాలా మంది భావించినా కానీ.. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణ కోసం జరిగిన కలయిక అని తెలుస్తోంది. మహేష్ బాబు పలు కోక్ బ్రాండ్ లకు అంబాసిడర్గా ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో మౌ**న్ డ్యూ యాడ్ షూటింగ్ కోసం వీరిద్దరూ కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.
జాఫర్ ఈ సందర్భంగా చాలా ఎగ్జయిటింగ్ గా కనిపించారు. మహేష్ బాబుతో గడిపిన సమయం అద్భుతంగా ఉంది. గొప్ప గా కలిసిపోయి మాట్లాడుకున్నాం... గొప్ప ఎనర్జీ ఆయన... ఇలాగే వెలిగిపో మహేష్ బాబు! అంటూ జాఫర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
సినిమా చేసే అవకాశం ఉందా?
ప్రస్తుతానికి వీరిద్దరి కలయికలో సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ జాఫర్ తన మాస్ యాక్షన్ చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. టైగర్ జిందా హై, సుల్తాన్ లాంటి బ్లాక్ బస్టర్లను సల్మాన్ ఖాన్ కి అందించాడు. భవిష్యత్తులో మహేష్ కోసం ఒక భారీ యాక్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. సల్మాన్ కి మహేష్ సన్నిహితుడే గనుక ఈ కాంబినేషన్ పాజిబుల్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఒకవేళ మారిన మల్టీస్టారర్ ట్రెండ్ లో ఒక బాలీవుడ్ స్టార్, ఒక టాలీవుడ్ స్టార్ ని కలిపి సినిమా తీయాలనుకుంటే, సల్మాన్ - మహేష్ లను కలిపి అలీ అబ్బాస్ జాఫర్ ఏదైనా ప్రయత్నిస్తే బావుంటుందేమో! అని అభిమానులు సూచిస్తున్నారు.
అలీ అబ్బాస్ జాఫర్ ప్రస్తుత ప్రాజెక్టులు:
ప్రస్తుతం యష్ రాజ్ ఫిలిమ్స్ (YRF) బ్యానర్లో అహాన్ పాండే-శార్వరీ వాఘ్లతో ఒక భారీ యాక్షన్ రొమాన్స్ చిత్రాన్ని జాఫర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ ఒక కీలక పాత్ర (నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర) పోషిస్తున్నట్లు సమాచారం. దీని షూటింగ్ 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభం కానుంది. డిటెక్టివ్ షేర్డిల్ అనే చిత్రానికి జాఫర్ రచయితగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
వివాదంలోను..
అలీ అబ్బాస్ జాఫర్ ఇటీవల `బడే మియాన్ చోటే మియాన్` (2024) లాంటి డిజాస్టర్ కి దర్శకత్వం వహించాడు. దీని కారణంగా నిర్మాత వాషూ భగ్నానీతో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. భగ్నానీ- జాఫర్ ఒకరితో ఒకరు కోర్టులో పోరాడుతున్నారు. ఈ భారీ సినిమా బడ్జెట్ ను అలీ అబ్బాస్ జాఫర్ సుమారు 80 కోట్లు పెంచేశారని, దుబాయ్లో ఒక బినామీ కంపెనీ ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడ్డారని వాషూ భగ్నానీ ఆరోపించారు. ఈ వివాదం ముదిరి ముంబై పోలీసులు జాఫర్పై ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదు చేశారు. మరోవైపు తన పారితోషికంలో రూ.7.3 కోట్లు నిర్మాత చెల్లించలేదని జాఫర్ కూడా ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (ఎఫ్డబ్ల్యూఐసిఇ)లో ఫిర్యాదు చేశారు.
ఇప్పుడు మహేష్ బాబు వంటి స్టార్తో యాడ్ షూటింగ్ కారణంగా జాఫర్ వార్తల్లో నిలుస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళితో వారణాసి (SSMB29) చిత్రాన్ని వేగంగా పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు తన తదుపరి ప్రాజెక్టు గురించి వెల్లడించాల్సి ఉంది.