ఒక్క పాత్ర.. టాలీవుడ్ కి దూరం అయ్యేలా చేసింది - ఆనంద్ హీరోయిన్!
అప్పుడప్పుడు అనుకోని సందర్భాలలో కొంతమంది వ్యక్తుల కారణంగా లేదా.. సినిమాల కారణంగా ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వస్తుంది.;
అప్పుడప్పుడు అనుకోని సందర్భాలలో కొంతమంది వ్యక్తుల కారణంగా లేదా.. సినిమాల కారణంగా ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం ఒక పాత్ర కారణంగా తాను ఇండస్ట్రీకి దూరం అయ్యానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు కమలినీ ముఖర్జీ. రాజా హీరోగా వచ్చిన 'ఆనంద్' సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ చిన్నది.. గోదావరి, గమ్యం, స్టైల్, గోపి గోపిక గోదావరి ఇలా పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. చివరిగా రామ్ చరణ్ హీరోగా నటించిన 'గోవిందుడు అందరివాడేలే' సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమయింది. ఆ తర్వాత ఇతర భాషలలో రెండు సినిమాలు చేసి.. 2016లో మలయాళం మూవీ 'పులి మురుగన్' తర్వాత పెళ్లి చేసుకుని సినీ పరిశ్రమకు దూరమైంది.
అందుకే తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యాను - కమలిని ముఖర్జీ..
ప్రస్తుతం భార్యగా కుటుంబాన్ని చూసుకుంటూ కెరీర్ సాగిస్తున్న ఈమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను సినిమాలలో చేయకపోవడానికి అసలు కారణాలు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంటర్వ్యూలో భాగంగా కమలినీ ముఖర్జీ మాట్లాడుతూ.." నేను తెలుగులో ఎన్నో రకాల ఎమోషన్స్ తో కూడిన పాత్రలలో నటించాను. బలమైన స్త్రీ పాత్రలు కూడా చేశాను. అదే సమయంలో సున్నితమైన అమ్మాయిగా కూడా కనిపించాను. అన్ని పాత్రలు చేసిన నాకు టాలీవుడ్ లో బలమైన క్యారెక్టర్లు రావడం తగ్గిపోయాయి. చివరిగా గోవిందుడు అందరివాడేలే సినిమాలో నాకు సరైన ప్రాముఖ్యత లభించలేదు అనిపించింది. సినిమా పూర్తయ్యాక నా పాత్ర చూసుకొని నాకే ఇబ్బందిగా అనిపించింది. బాధపడ్డాను.. గొడవపడాలని, రచ్చ చేయాలని అనుకోలేదు. అందుకే గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత తెలుగు సినిమాలు చేయకూడదని నిర్ణయించుకొని ఇక టాలీవుడ్ కి దూరం అయ్యాను" అంటూ కమలినీ ముఖర్జీ చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే తాను చేసిన ఆ ఒక్క పాత్ర తనకు సినిమాలపై విరక్తి కలిగేలా చేసింది అని.. అందుకే తాను తెలుగులో మరో అవకాశాన్ని అందుకోకుండా శాశ్వతంగా గుడ్ బై చెప్పేసాను అంటూ తెలిపింది కమలిని ముఖర్జీ.
టాలీవుడ్ పై కమలినీ ముఖర్జీ ఊహించని కామెంట్స్..
తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి కూడా ఈమె మాట్లాడుతూ.." సినిమాలలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. దర్శకుడు ఒక సీన్ చేయమంటారు. తీరా అది అవసరం లేదనో లేక బాగోలేదనో మళ్లీ దానిని ఎడిటింగ్ లో తీసేస్తుంటారు. అలా ఎడిటింగ్ లో తీసేసిన దాన్ని నటీనటులకు చెప్పరు. ఒక మాట కూడా మనతో చెప్పకుండా మన సీన్ లేదా డైలాగులు తీసేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. దాన్ని నేను లైట్ తీసుకోలేకపోయాను. బాధగా అనిపించడంతో తెలుగు సినిమా నుంచి తప్పుకొని ఇతర భాషల్లో సినిమాలు చేశాను" అంటూ కమలిని ముఖర్జీ తెలిపింది. మొత్తానికైతే తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకు బలమైన క్యారెక్టర్లు ఇవ్వలేదని, అందుకే నటించడం ఇష్టం లేక దూరం అయ్యాను అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.