'పెద్ది' సీన్‌ రీ క్రియేట్‌ చేసిన ఐపీఎల్‌ స్టార్‌

రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.;

Update: 2025-05-06 12:31 GMT

రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్‌ షాట్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ముఖ్యంగా రామ్‌ చరణ్‌ ఆడిన క్రికెట్‌ షాట్‌కి స్టార్‌ క్రికెటర్స్ సైతం షాక్‌ అయ్యారు. రామ్‌ చరణ్‌ యొక్క పాత్రను పరిచయం చేయడం కోసం బుచ్చిబాబు ఎంపిక చేసుకున్న ఆ క్రికెట్‌ షాట్‌ను చాలా మంది విమర్శిస్తూ ఉంటే, కొద్ది మంది మాత్రం వావ్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మొత్తానికి పెద్ది సినిమాలోని రామ్‌ చరణ్‌ క్రికెట్‌ షాట్‌ను ఇప్పుడు సోషల్‌ మీడియాలో చాలా మంది రీ క్రియేట్‌ చేస్తున్నారు. తాజాగా ఒక వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది.

పెద్ది ఫస్ట్‌ షాట్‌ వీడియోను చాలా మంది రీ క్రియేట్‌ చేస్తున్నారు. అయితే ఈసారి ప్రముఖ క్రికెటర్‌ షాట్‌ను అచ్చు గుద్దినట్లుగా రీ క్రియేట్‌ చేయడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ అశుతోష్ శర్మ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేసిన సమయంలో పెద్ది షాట్‌ ను రీ క్రియేట్‌ చేయడం జరిగింది. ఆ షాట్‌కి మంచి స్పందన దక్కింది. సన్‌ రైజర్స్‌ తో జరిగిన మ్యాచ్‌ కోసం ఢిల్లీ ఆటగాడు అశుతోష్ ప్రాక్టీస్ సమయంలో ఈ షాట్‌ను ప్రాక్టీస్ చేశాడు. రామ్‌ చరణ్ చేసినట్లుగానే పిచ్‌ పై ఉన్న మట్టిని చేతికి పూసుకుని, చరణ్ వచ్చినట్లుగానే బంతి పడ్డ సమయంలో ముందుకు ఉరికి వచ్చి, బ్యాట్‌ను కింద కొట్టి మరీ షాట్‌ను భారీగా కొట్టాడు.

రామ్‌ చరణ్‌ ఆ షాట్‌ కోసం చాలా కష్టపడ్డాడు. ప్రముఖ క్రికెటర్‌ సైతం ఆ షాట్‌ను ఆడటానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. అలాంటిది రామ్‌ చరణ్ బాడీ లాంగ్వేజ్‌, ఆయన యొక్క కదలికలు అచ్చు గుద్దినట్లుగా ప్రముఖ క్రికెటర్‌ ను పోలి ఉన్నాయి అంటూ ప్రముఖ క్రికెటర్స్ సైతం చెప్పుకొచ్చారు. రామ్‌ చరణ్ పెద్ది సినిమాలో కేవలం క్రికెట్‌ మాత్రమే ఆడకుండా ఇంకా చాలా ఆటల్లోనూ కనిపిస్తూ ఉంటాడు. ఫిజికల్‌గా ఎక్కువ బలం వినియోగించాల్సిన ఆటల్లో రామ్‌ చరణ్‌ ఆడుతాడని, అందుకు తగ్గట్లుగానే రామ్‌ చరణ్‌ తన ఫిజిక్‌ను మార్చుకున్నాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు.

గేమ్‌ ఛేంజర్ సినిమాతో నిరాశ పరచిన రామ్‌ చరణ్‌ పెద్ది సినిమాతో అభిమానుల కోరికను తీర్చబోతున్నాడు. బుచ్చిబాబు మొదటి సినిమాతోనే వంద కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకున్న నేపథ్యంలో రామ్‌ చరణ్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం దక్కించుకున్నాడు. రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబో సినిమాకు ఏఆర్ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరగడం ఖాయం. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ను ప్రముఖ హీరోయిన్‌ శ్రీలీల చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి క్లారిటీ రాలేదు. వచ్చే ఏడాది సమ్మర్‌ ఆరంభంలో సినిమాను విడుదల చేయబోతున్నారు.

Tags:    

Similar News