మార్ఫింగ్ వివాదం.. కోర్టులో శిల్పాశెట్టికి ఊరట
ఓవైపు 60కోట్ల ఆర్థిక మోసం కేసులో విచారణ ఎదుర్కొంటున్న శిల్పాశెట్టి, తన వ్యక్తిత్వ హక్కుల విషయంలో కోర్టుల నుంచి సానుకూల తీర్పును పొందడం చర్చనీయాంశమైంది.;
ఓవైపు 60కోట్ల ఆర్థిక మోసం కేసులో విచారణ ఎదుర్కొంటున్న శిల్పాశెట్టి, తన వ్యక్తిత్వ హక్కుల విషయంలో కోర్టుల నుంచి సానుకూల తీర్పును పొందడం చర్చనీయాంశమైంది. తన అనుమతి లేకుండా తన మార్ఫ్ డ్ ఫోటోలు, వీడియోలు, వాయిస్ లను దుర్వినియోగం చేయకుండా, తన హక్కులను కాపాడుకునేందుకు శిల్పాశెట్టి బాంబే హైకోర్టులో పిల్ ని దాఖలు చేసారు. దీనిపై విచారించిన కోర్టు ఆ మేరకు శిల్పాశెట్టికి అనుకూలంగా తీర్పును వెలువరించింది.
నటి శిల్పా శెట్టి మార్ఫింగ్ చేసిన ఫోటోలు. వీడియో కంటెంట్ ను వెంటనే తొలగించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ కంటెంట్ తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, శిల్పా హక్కులను తీవ్రంగా ఉల్లంఘించే కంటెంట్ ఇది అని కోర్టు పేర్కొంది. ఇప్పటికే ఆన్లైన్లో ప్రచారానికి వినియోగిస్తున్న మార్ఫ్ డ్ డిజిటల్ మెటీరియల్ కారణంగా ఆమె గుర్తింపును, వ్యక్తిత్వాన్ని కోల్పోతోంది. దీనిని దుర్వినియోగం చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ శెట్టి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించగా తాజా ఉత్తర్వు వెలువడింది.
పలు సంస్థలు సోషల్ మీడియాల్లో ఉపయోగిస్తున్న ఏఐ కంటెంట్ ని పరిశీలించిన న్యాయమూర్తులు, ఇవి తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇవి చాలా కలతపెట్టేవి అని అన్నారు. ఒకరి వ్యక్తిత్వాన్ని గోప్యతను ఇలా అనుమతి లేకుండా చిత్రీకరించకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. అనుచితమైన ఆమోదయోగ్యం కానివి.. శెట్టి ఇమేజ్- ప్రతిష్టకు తీవ్రమైన హాని కలిగించేవిగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. సంబంధిత యూఆర్ఎల్ లను తొలగించాలని కూడా కోర్టు ఆదేశించింది.
తన గొంతును, భావాలను, ప్రవర్తను క్లోన్ చేయడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగించారని .. అనుమతి లేకుండా మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలు, పుస్తకాలు, వస్తువులను పంపిణీ చేశారని శిల్పా శెట్టి కోర్టును ఆశ్రయించారు. తన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించే అన్ని వెబ్ సైట్లను బ్యాన్ చేయాలని కోర్టును కోరారు.
శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా 60కోట్ల ఆర్థిక నేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో, విచారణ కోర్టులో ఉండగా, ఇప్పుడు ఇతర కేసుల్లో ఈ సానుకూల తీర్పు ఆసక్తిని కలిగిస్తోంది. ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తకు సంబంధించిన రూ. 60.4 కోట్ల మోసానికి సంబంధించి ఆర్థిక నేరాల విభాగం (ఇవోడబ్ల్యూ) ఈ జంటపై కేసు నమోదు చేసింది. ఒక టీవీ చానల్ పేరుతో తనవద్ద నుంచి డబ్బు తీసుకున్నారని, తనను భాగస్వామిని చేస్తానని చెప్పి మోసం చేసారని అతడు ఆరోపించాడు. అయితే ఈ కేసులో మీడియా అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ తమను క్రిమినల్స్ గా చిత్రీకరిస్తోందని శిల్పాశెట్టి ప్రత్యారోపణలు చేసారు. తమపై ఉన్నవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టి పారేసారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, శిల్పా శెట్టి చివరిగా 2023లో వచ్చిన హిందీ చిత్రం `సుఖీ`లో కనిపించారు. ఇది పెద్దగా ఆడలేదు. తదుపరి 2026లో కన్నడ పాన్-ఇండియా చిత్రం `కేడీ: ది డెవిల్`తో తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. రోహిత్ శెట్టి సింగం 3లోను శిల్పాశెట్టి కనిపించిన సంగతి తెలిసిందే.